గుజరాత్లో చిక్కుకున్న ఏపీ మత్స్యకారులు: సీఎంకు ఫోన్ చేసిన వెంకయ్యనాయుడు
న్యూఢిల్లీ/అమరావతి: గుజరాత్లోని వీరావల్లో చిక్కుకున్న ఉత్తరాంధ్ర మత్స్యకారులను స్వరాష్ట్రం రప్పించేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రయత్నాలు ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ గవర్నర్ దేవవ్రత్, ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో ఆయన ఈ విషయంపై మాట్లాడారు.
తెలుగు మత్స్యకారులకు అన్ని వసతులు సమకూర్చుతున్నట్లు ఉపరాష్ట్రపతికి గుజరాత్ సీఎం ఈ సందర్భంగా వివరించారు. మత్స్యకారులకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, వారికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటున్నామని వెంకయ్యకు గుజరాత్ సీఎం రూపానీ వివరించారు. అమిత్ షా కూడా ఈ విషయంపై తనతో మాట్లాడారని తెలిపారు.
మత్స్యకారులను రోడ్డు మార్గంలో కాకుండా సముద్ర మార్గంలోనే ఏపీకి పంపాల్సి రావొచ్చని సీఎం తెలిపారు. ఏపీ ప్రభుత్వంతో సంప్రదించి తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంమంత్రి చెప్పినట్లు వెంకయ్యనాయుడుకు సీఎం రూపానీ వివరించారు.
కాగా, ఉత్తరాంధ్ర మత్య్సకారులను సముద్ర మార్గం ద్వారానే ఏపీకి తరలించే ఏర్పాట్లు చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్.. గుజరాత్ సీఎం రూపానీని కోరారు. లాక్ డౌన్ కారణంగా మత్స్యకారులను సముద్ర మార్గం ద్వారా తరలింపునకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులను కూడా జగన్ ఆదేశించారు.
గుజరాత్లోని వీరావల్ ప్రాంతంలో దాదాపు 5వేల మంది ఉత్తరాంధ్ర మత్య్సకారులు చిక్కుకుపోయారు. కాగా, దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న వీరిలో వారం రోజుల వ్యవధిలో ఇద్దరు అనారోగ్యంపాలై ప్రాణాలు కోల్పోయారు. తాగేందుకు నీరు తప్ప ఎలాంటి ఆహారం, వైద్య సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో సీఎం జగన్ స్పందించారు. ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా గుజరాత్ సీఎంతో మాట్లాడారు.