బిజెపి వ్యూహం: ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య దాదాపు ఖాయం
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా కేంద్రమంత్రి, బిజెపి నేత వెంకయ్య నాయుడు పేరు దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా కేంద్రమంత్రి, బిజెపి నేత వెంకయ్య నాయుడు పేరు దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.
ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు అభ్యర్థిత్వం అయితేనే ఎన్డీయే పక్ష పార్టీలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇతర పక్షాలు కూడా ఆయనకు ఆమోదం తెలుపుతాయని బీజేపీ భావిస్తోంది.
దీంతో వెంకయ్య నాయుడును ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేయనున్నారని ప్రచారం సాగుతోంది. పార్టీ కీలక నేతల్లో ఆయన ఒకరు. సంక్షోభ సమయంలో వెంకయ్య పోషించిన పాత్రను బిజెపి నేతలు గుర్తు చేసుకున్నారు.
వెంకయ్య అయితే ఎన్డీయేలో ఏకాభిప్రాయం రావడంతో పాటు తటస్థ పార్టీలు కూడా రామ్నాథ్ కోవింద్కు మద్దతిచ్చినట్లుగా.. ఈయనకు మద్దతిస్తాయని భావిస్తున్నారు. ఏ రకంగా చూసినా ఆయనే బెస్ట్ అని భావిస్తున్నారు. ఉప రాష్ట్రపతి పదవికి ఆయన అన్ని విధాలా సమర్థుడని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు.
వ్యూహాత్మకంగా...
ఉత్తరాదికి ప్రాధాన్యత ఇస్తున్నారని దక్షిణాది నుంచి ఇటీవల విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాదికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పేందుకు బిజెపి వెంకయ్య పేరును తెరపైకి తెచ్చిందని అంటున్నారు.
అలాగే, వెంకయ్య అభ్యర్థి అయితే పార్టీలకు అతీతంగా చాలామంది మద్దతు పలుకుతారని భావిస్తున్నారు. దక్షిణాది నుంచి వెంకయ్యకు మద్దతు లభించనుంది. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మద్దతు లభించనుంది.
రాష్ట్రపతి ఎన్నికల సమయంలో చాలామంది పేర్లు వినిపించాయి. కానీ అనూహ్యంగా రాంనాథ్ కోవింద్ను తెరపైకి తెచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో దళిత నేతను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చినట్లు, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో దక్షిణాది వ్యక్తిని అలాగే తెచ్చారని అంటున్నారు.