కరోనాతో యుద్ధం చేసి గెలిచినా... సామాజిక వివక్షతో కృంగిపోతున్న బాధితులు
కరోనా వైరస్ ... ఒకరి నుండి ఇంకొకరికి వ్యాపించే ఈ వైరస్ తుమ్మినా, దగ్గినా, కరోనా వైరస్ ఉన్న వారితో కరచాలనం చేసినా, వారు తాకిన వస్తువులను ముట్టుకున్నా వస్తుంది. ఇలా కరోనా బారిన పడిన వారు ఐసోలేషన్ వార్డుల్లో చావుతో పోరాటం చేస్తున్నారు. కొందరు కరోనా మహమ్మారికి బలై విగత జీవులుగా మారుతుంటే మరికొందరు కరోనాపై యుద్ధం చేసి ప్రాణాలతో తిరిగి బయటపడుతున్నారు. కరోనా పాజిటివ్ ఉన్న వాళ్ళు ఆస్పత్రిలో వైద్య చికిత్సల అనంతరం కరోనా నెగిటివ్ రావటంతో వారికి పూర్తిగా నయం అయ్యిందని భావించిన తర్వాత వారిని డిశ్చార్జ్ చేసి ఇళ్ళకు పంపిస్తున్నారు.
కరోనా రోగులపై కొనసాగుతున్న వివక్ష
ఇక కరోనాపై యుద్ధంలో గెలిచినా సరే సామాజిక వివక్షతో ఓడిపోతున్నారు కరోనా బారిన పడి బయటపడిన వారు. కరోనా పేషెంట్ అనగానే అంటరాని వాళ్ళలా ఎప్పటికీ చూడాలని కాదని, వారిపై వివక్ష తగదని , కరోనా పాజిటివ్ గా ఉన్నప్పుడే వారి నుండి కరోనా ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని, తగ్గినా తర్వాత కూడా వారు కరోనా పేషెంట్స్ కారని చెప్తుంది. వారి పట్ల చిన్న చూపు తగదని సీఎం జగన్ మోహన్ రెడ్డి పదేపదే స్పష్టం చేశారు. అయినా ఏపీలో కరోనా బాధితులపై వివక్ష కొనసాగుతూనే ఉంది.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కరోనా రోగిని ఇల్లు ఖాళీ చెయ్యమన్న ఇంటి ఓనర్
ఇక తాజాగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన మహిళ పై వివక్ష కొనసాగింది . ఆమె పట్ల ఇంటి యజమాని చాలా అమానుషంగా ప్రవర్తించాడు. ఆమెను వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు . ఆసుపత్రి నుంచి వచ్చిన ఆమెను ఇంట్లోకి కూడా రానివ్వలేదు . ఇక అక్కడే ఉంటె తనకు కరోనా వస్తుందేమో అన్న అనుమానంతో ఆ ఇంటి ఓనర్ ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయాడు. ఈ పరిణామంతో ఆ మహిళ తీవ్ర మనస్థాపానికి లోనయ్యింది .
కరోనా నుండి బయటపడిన మహిళకు బాసటగా నిలిచిన తహసీల్దార్
అసలే లాక్ డౌన్ టైం .. అందులో నిన్నటి దాకా కరోనాతో, చావుతో పోరాటం చేసి వచ్చిన మహిళ ఇల్లు కోసం ఎక్కడికి వెళ్ళాలి. ఎక్కడ వెతుక్కోవాలి అని తీవ్ర మనోవేదనకు లోనయ్యింది. బాధితురాలు తహశీల్దార్ ఆఫీస్ లో అటెండర్ గా పని చేస్తుంది. ఇక ఈ విషయం తెలుకున్న తహశీల్దార్ జరీనా బాధితురాలిని చేరదీసింది. ఆమెకు మరో చోట ఆశ్రయం కల్పించింది. అయితే ఇలా వివక్ష చూపవద్దని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నా సరే వివక్ష మాత్రం కొనసాగుతుంది.
Recommended Video
ప్రభుత్వం అండగా ఉండాలని కోరుతున్న కరోనా రోగులు
యుద్ధం చెయ్యాల్సింది కరోనాపై , కరోనా రోగిపై కాదు అని ఎంత చెప్పినా ఈ వివక్ష మాత్రం నిత్యకృత్యంగా మారింది. కరోనా బారినపడిన వారు డిశ్చార్జ్ అయ్యి ఇళ్ళకు వచ్చినా వారిని సామాజిక బహిష్కరణ చేస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు . దీంతో వారు మానసికంగా కృంగిపోతున్నారు . అమానవీయంగా ప్రవర్తిస్తున్న వారిపై చర్యలకు ప్రభుత్వాలు ఉపక్రమించాలని కరోనా బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. కరోనా రావటం తాము చేసుకున్న పాపమా ? లేకా ఇది శాపమా ? అని తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ప్రభుత్వం తమకు అండగా ఉండాలని కోరుతున్నారు.