వీడియో: పట్టపగలే నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా యువకుడిని పొడిచి చంపేశాడు
ప్రకాశం: జిల్లా కేంద్రమైన ఒంగోలులో పట్టపగలే నడి రోడ్డుపై థామస్ అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. గాంధీ పార్క్ వద్ద జోసఫ్ అనే వ్యక్తి థామస్ను అందరూ చూస్తుండగానే కత్తితో పలుమార్లు పొడిచి చంపేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
తన భార్యతో గొడవ పడ్డాడని..
జోసఫ్ భార్య, థామస్ ఒంగోలులోని ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తున్నారు. వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ విషయమై జోసఫ్.. థామస్పై పగ పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం మాట్లాడదామని యువకుడిని పిలిపించాడు జోసఫ్.
అంతా చూస్తుండగా.. విచక్షణా రహితంగా కత్తితో దాడి..
అక్కడికి వచ్చిన థామస్ను జోసఫ్ విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. అతని భార్య అడ్డుకుంటున్నా ఆగకుండా వెంటపడి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే దారుణంగా హతమార్చాడు. నిందితుడిని నిలువరించేందుకు దారిన వెళుతున్న ఓ వ్యక్తి ప్రయత్నించినప్పటికీ.. ఆగకుండా దాడి చేయడంతో థామస్ అక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలుకోల్పోయాడు.
హత్య చేసి లొంగిపోయాడు.. సీసీ కెమెరాల్లో దారుణం..
ఈ హత్య ఘటనకు సంబంధించిన వీడియో గాంధీ పార్కుకు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఆ వీడియోనే ఇప్పుడు వైరల్గా మారింది. అయితే, థామస్ను హత్య చేసిన నిందితుడు జోసప్ ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్తి కోసం అత్తామామల హత్య.. చివరకు
ఇది ఇలావుండగా, కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఆస్తి కోసం అత్తామామలను చంపేశాడు ఓ దుర్మార్గుడు. ఇందుకు అతని భార్య కూడా సహకరించడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన ముత్తయ్య(70), సుగుణమ్మ(50) దంపతుల ముగ్గురి సంతానంలో చివరి కుమార్తె మనీషా, గ్రామంలో వాలంటీర్గా పనిచేస్తున్న నెమలిబాబు ప్రేమించుకున్నారు. పెళ్లి విషయమై గొడవలు జరిగాయి. పెళ్లి సందర్భంగా 1.50 లక్షలు ఇచ్చేందుకు పెద్దల ముందు అంగీకరించారు. 4 నెలల క్రితం వివాహం కాగా, కట్నం ఇప్పటికీ ఇవ్వలేదని నెమలిబాబు అత్తామామలపై కోపం పెంచుకున్నాడు. రూ. 50వేలకు మించి ఇవ్వలేమని చెప్పడంతో బుధవారం రాత్రి అత్తామామలు నిద్రలో ఉండగా వారిని గొంతుకోసి చంపేశాడు. ఇందుకు అతని భార్య కూడా సహకరించింది. హత్య చేసి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు.. నిందితులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.