video : ఏపీ రాజధాని వ్యాఖ్యల వివాదం- సారీ చెప్పిన యాంకర్ ప్రదీప్
బుల్లితెర ప్రేక్షకులకు తన యాంకరింగ్తో సుపరిచితుడైన ప్రదీప్ మాచిరాజు తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఏపీ రాజధానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఇరుకునపడ్డాడు. దీంతో అమరావతి పరిరక్షణ సమితి ప్రదీప్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రదీప్ దిగొచ్చాడు.
తాజాగా ఓ టీవీ షోలో యాంకర్ ప్రదీప్ ఏపీ రాజధాని ఏది అంటూ ప్రశ్న అడగటం, దానికి వైజాగ్ అని సమాధానం చెప్పడం వివాదాస్పదంగా మారింది ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ న్యాయవివాదాల్లో ఉండటం, మరోవైపు రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా అమరావతిలో ఆందోళనలు సాగుతున్న నేపథ్యంలో ప్రదీప్ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ప్రదీప్ టీవీ షోలో చేసిన వ్యాఖ్యలపై అమరావతి రైతులు మండిపడ్డారు. తమను కించపరిచే విధంగా ప్రదీప్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ అభ్యంతరం తెలిపారు. తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే హైదరాబాద్లో ప్రదీప్ ఇల్లు ముట్టడిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు.
అమరావతి పరిరక్షణ సమితి ఆగ్రహం నేపథ్యంలో యాంకర్ ప్రదీప్ దిగొచ్చాడు. ఏపీ రాజధానిపై తాను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపాడు. తన వ్యాఖ్యలతో ఎవరైనా ఇబ్బంది పడితే క్షమాపణలు చెప్తున్నట్లు ప్రదీప్ తెలిపాడు. ఈ మేరకు ప్రదీప్ ఓ వీడియో విడుదల చేశాడు. ఇందులో తనకు ఎవరినీ కించ పరిచే ఉద్దేశం లేదని, కేవలం నవ్వించేందుకు మాత్రమే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు వివరణ ఇచ్చాడు. దీంతో ఈ వివాదానికి తెరదింపే ప్రయత్నం చేశాడు. అయితే ప్రదీప్ వ్యాఖ్యలపై అమరావతి రైతులు ఏమంటారో చూడాల్సి ఉంది.
ఏపీ రాజధాని వ్యాఖ్యల వివాదం- సారీ చెప్పిన యాంకర్ ప్రదీప్#Padeepmachiraju #Andhrapradesh #Vizag pic.twitter.com/RMaIOVRGO2
— oneindiatelugu (@oneindiatelugu) June 21, 2021