పులివెందుల పిల్లి వైఎస్ జగన్, విజయే పులి, ముసుగేసి అరెస్ట్ చేయడం సరికాదు: నారా లోకేశ్
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం మెడలు వంచుతానని ప్రగల్బాలు పలుకుతున్న జగన్.. సోషల్ మీడియాకు ఎందుకు వణుకుతున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
బీసీల నిధులను అమ్మఒడి పథకానికి మళ్లించారని ప్రజలు ప్రశ్నించొద్దా అని లోకేశ్ అడిగారు. పులివెందులకు చెందిన టీడీపీ కార్యకర్త విజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని గుర్తుచేశారు. పోస్ట్ చేస్తే వివరణ అడగాలే తప్ప.. ముసుగేసి అరెస్ట్ చేయడం ఏంటీ అని లోకేశ్ ప్రశ్నించారు. ఇది సరికాదని.. జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
సీఎం జగన్ మెప్పుకోసం అధికారులు తహతహలాడుతోన్నారని నారా లోకేశ్ విమర్శించారు. వారు ఇలాగే ప్రవర్తిస్తే కోర్టు మెట్టికాయలు వేయడం తప్పదన్నారు. విజయ్ పోస్ట్ను తాను కూడా పోస్ట్ చేస్తున్నానని లోకేశ్ పేర్కొన్నారు. జగన్ సర్కార్ ఏం చేస్తుందో చేసుకోవాలని సవాల్ విసిరారు. పరిస్థితి చూస్తుంటే పులివెందుల పులి ఎవరో అర్థమవుతోందన్నారు. విజయ్ పులివెందుల పులి అయితే జగన్ మాత్రం పులివెందుల పిల్లి అని సెటైర్ వేశారు.