విలాస పురుషుడు: తిరుమలతో మాల్యా లింకేమిటి?
తిరుపతి: అప్పుల ఊబిలో కూరుకుపోయి విదేశానికి చెక్కేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమలతో విడదీయరాని సంబంధం ఉంది. ఆయన రెండు నెలలకు ఓసారైనా తిరుమలకు వచ్చి వెళ్తుండేవారు.
ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నప్పటికీ ఆయన తిరుమల రావడం మాత్రం మానలేదు. శ్రీవారి దర్సనార్థం వచ్చి వెళ్తుండేవారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్గా ఆదికేశవులు నాయుడు ఉన్నప్పుడు మరింత ఎక్కువగా తిరుమల వచ్చి వెళ్తుండేవారు. ఆదికేశవులు నాయుడితో వ్యాపారపరమైన స్నేహం కారణంగానే రాకపోకలు పెరిగినట్లు చెబుతారు.
బ్యాంకు అప్పులు పేరుకుపోయినా, కింగ్ఫిషర్ మూతపడినా విజయ్ మాల్యా విలాసవంతమైన జీవితంలో మాత్రం ఏ విధమైన మార్పూ రాలేదు. ఐపిఎల్ ఆటగాళ్ల వేలం, గుర్రాల కొనుగోలు వంటి వ్యవహారాలతో ఆయన తీరిక లేకుండా గడుపుతూ వచ్చారు. ఉద్యోగులు వేతనాల కోసం అంగలారుస్తున్న సమయంలోనే ఆయన నిరుడు డిసెంబర్ 18వ తేదీన గోవాలో తన 60వ జన్మదిన వేడుకలను ఆర్భాటంగా చేసుకున్నారు.
దాదాపు 600 మంది ఆ జన్మదిన వేడుకలకు హాజరయ్యారు. మూడు రోజుల పాటు వేడుకలు జరిగాయి. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఉద్యోగులు జీతాల కోసం ఆందోళన చెందుతున్న సమయంలోనే ఆనయ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపియల్ జట్టు కోసం ఆటగాళ్లను కొనుగోలు చేయడంలో మునిగి తేలారు.
ఆటగాళ్లకు ఇలా కోట్లు వెచ్చించారు...
ఐపిఎల్ వేలంలో ఆటగాళ్ల కోసం విజయ్ మాల్యా కోట్లాది రూపాయలు వెచ్చించారు. 2013లో 12.14 కోట్ల రూపాయలు, 2014లో రూ.30 కోట్లు, 2015లో రూ.18.5 కోట్లు, 2016లో రూ.15.45 కోట్లు వెచ్చించి ఆటగాళ్లను కొనుగోలు చేశారు.
2014 ఫిబ్రవరిలో మాల్యా రూ.4 కోట్లకు ఓ అశ్వాన్ని కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ మూతపడక ముందు తన విలాసవంతమైన జీవితం ద్వారా ఆయన ఎప్పుడూ వార్తల్లో ఉండేవారు. మీడియా కోసం కూడా ఆయన విరివిగానే వెచ్చించినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన ఇప్పుడు మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం విజయ్ మాల్యా లండన్లో ఉన్నారు. అయితే, తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆయన రహస్యంగా వచ్చే అవకాశం ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే, అది సులభం కాకపోవచ్చునని కూడా అంటున్నారు.