విజయసాయి కౌంటర్: గంటా వచ్చినా.. రాకున్నా నో ఫరక్! మైండ్గేమ్ అవసరమే లేదు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మార్పు అంశంపై హాట్టాపిక్గా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై గంటా శ్రీనివాసరావు స్పందించడం, దానిపై మరోసారి విజయసాయి కౌంటర్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గంటా ప్రతిపాదనలు పంపారు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని గంటా శ్రీనివాసరావు గతంలో ప్రతిపాదన పంపారని, దానిపై సీఎం వైఎస్ జగన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని విజయసాయి రెడ్డి తెలిపారు. గంటా ప్రతిపాదనను సీఎం ఆమోదిస్తే పరిగణలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు.
మైంగ్గేమ్ అవసరం లేదు.. తేడా ఉండదు
మైండ్ గేమ్ ఆడాల్సిన అవసరం తమ పార్టీకి లేదని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తేల్చి చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి గంటా శ్రీనివాసరావు వచ్చిన మాత్రాన పార్టీలు, ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ నేతల వ్యాఖ్యలతో విశాఖ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
సీఎం జగన్ ఆమోదిస్తే..
కాగా, బుధవారం గంటా శ్రీనివాస్ ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాథ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. జగన్ పాలనకు ఆకర్షితులై చాలా మంది నేతలు వైసీపీలో చేరుతున్నారన్నారు. గంటా శ్రీనివాసరావు కూడా కొన్ని ప్రతిపాదనలు పంపారని, సీఎం జగన్ ఆమోదం తర్వాత పార్టీలోకి ఆయన వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..
విజయసాయి వ్యాఖ్యల నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు కూడా స్పందించారు. తాను పార్టీ మారతానంటూ విజయసాయి చేసిన వ్యాఖ్యలో వాస్తవం లేదన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు ఇప్పటికే అనేకసార్లు ప్రచారం జరిగిందని.. దాన్ని ఇప్పటికీ ఖండిస్తూనే ఉన్నానని చెప్పారు. విజయసాయి రెడ్డి ఏ లక్ష్యంతో తన గురించి ఆ వ్యాఖ్యలు చేశారో తెలియదన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇదో మైండ్ గేమ్ కావొచ్చని అన్నారు. సీఎంకు తాను ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదన్నారు. ఈ నేపథ్యంలోనే గంటాకు విజయసాయి కౌంటర్ ఇచ్చారు.