సాయిరెడ్డి ఫిట్టింగ్ మామాలుగా లేదు:టీడీపీ ఎమ్మెల్యేలు తెగించేశారా: జగన్..బాబు నువ్వా నేనా సై..!
చంద్రబాబు అన్న టీడీపీ అన్న ఒంటికాలుపై విరుచుకుపడుతారు వైసీపీ నేత రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి. ప్రముఖ సోషల్ మీడియా ట్విటర్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే విజయసాయిరెడ్డి మరోసారి ఆ ట్విటర్ వేదికగానే ఓ సంచలన ట్వీట్ చేశారు. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటి.. ట్వీట్ చేయడం ద్వారా విజయసాయిరెడ్డి ఏం సంకేతాలు ఇస్తున్నారు..?
సాయిరెడ్డి ట్వీట్ ఆంతర్యమేంటి..?
వైసీపీ నేత రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మరో ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్పై ఇటు రాజకీయ వర్గాల్లోను అటు వైసీపీలోను చర్చ జరుగుతోంది. టీడీపీలో ఎవరుంటారు ఎవరు వెళ్లిపోతారు బలమేంటనేది జూన్ 19న తెలుస్తుందంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇదే ట్వీట్ పై చర్చ జరుగుతోంది. జూన్ 19న రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నాలుగు సీట్లు వైసీపీ ఖాతాలోకే వెళుతున్నాయి. అయితే టీడీపీ నెగ్గదని తెలిసినా బరిలో వర్ల రామయ్యను పోటీకి ఉంచింది. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. టీడీపీ గెలుస్తామని ధీమాతో ఉన్నప్పుడు కనకమేడల లాంటి వారు గుర్తుకు వస్తారని.. అదే కచ్చితంగా రాజ్యసభ సీటు నెగ్గలేరని తెలిసినప్పుడు మాత్రం బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు అభ్యర్థులుగా గుర్తుకువస్తారని ధ్వజమెత్తారు విజయసాయి రెడ్డి. అంతేకాదు భోగాలు మీవి, త్యాగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలవా అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
వైసీపీలోకి క్యూ కడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు..?
విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ పై పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. జూన్ 19న ఎవరు టీడీపీతో ఉంటారు , ఎవరి బలం ఎంతో తేలిపోతుందని వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు లోతుగా విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్న వేళ సాయిరెడ్డి ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని నెలల క్రితం మద్దాలి గిరి, వల్లభనేని వంశీలు టీడీపీకి దూరంగా ఉంటూ ఏకంగా చంద్రబాబుపైనే నిప్పులు చెరుగుతుండగా... తాజాగా కరణం బలరాం కూడా జగన్ పాలనకు జై కొట్టారు. అంతేకాదు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా వైసీపీలోకి వచ్చేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారంటూ కరణం బలరాం వ్యాఖ్యలు చేశారు.
జూన్ 19న ఏం జరగబోతోంది..?
ఇక జూన్ 19వ తేదీన జరగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ విప్ జారీ చేస్తుంది. ఆ విప్ను ధిక్కరించి టీడీపీ నేతలు వ్యవహరిస్తారా అనేది సాయిరెడ్డి ట్వీట్ ఆలోచింప చేస్తోంది. ఒకవేళ టీడీపీ ఎమ్మెల్యేలు విప్ ధిక్కరిస్తే టీడీపీ వారిపై అనర్హత వేటు వేయాలంటే స్పీకర్ను కోరే అవకాశం ఉంది.అయితే స్పీకర్ విచక్షణాధికారం మేరకే ఇది ఉంటుంది. మరోవైపు మూడింట రెండో వంతు ఎమ్మెల్యేలు తాము టీడీపీలో కొనసాగలేమని లేఖ ఇస్తూ తమను అధికార పార్టీలోకి విలీనం చేయాలంటూ కోరే అవకాశమూ లేకపోలేదు. అప్పుడు మళ్లీ స్పీకర్ నిర్ణయం కీలకం కానుంది. తెలంగాణలో నాడు టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉంటూ అప్పటి స్పీకర్ను కలిసి తమను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తించాలంటూ ఎర్రబెల్లి దయాకర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు లేఖ ఇచ్చిన విషయం గుర్తు ఉండే ఉంటుంది.
చంద్రబాబు ఏం చేస్తారు..?
రాజ్యసభ ఎన్నికల్లో తాము గెలవలేమని తెలిసినప్పటికీ కూడా చంద్రబాబు ఈ ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను ఫిక్స్ చేయాలని భావించిన నేపథ్యంలోనే రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థిని పోటీకి పెట్టినట్లుగా అర్థమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పొలిటికల్ గేమ్కు విజయసాయిరెడ్డి ట్వీట్ మరింత బలం చేకూరుస్తోంది. ఒకవేళ టీడీపీ ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించి తాము మద్దతు తెలపడం లేదని చెబితే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా దక్కే అవకాశాలు కూడా చాలా తక్కువే. ఇదంతా ఒకలా ఉంటే... విప్ దిక్కరించే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి ఉపఎన్నికలకు వెళతారా అనేది కూడా చర్చ జరుగుతోంది. సాధారణంగా ఉపఎన్నికల సమయంలో అధికారంలో ఉండే పార్టీలే విజయం సాధిస్తాయనేది చంద్రబాబుకు తెలియని విషయం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ సమయంలో విజయసాయిరెడ్డి ఒక్క ట్వీట్తో ఎన్నో అనుమానాలకు తెరదీశారని అనలిస్టులు చెబుతున్నారు.