ఇకపై హిమాలయా వాటర్ బాటిళ్లు కనిపించవు: టీడీపీ నేతలకు విజయసాయిరెడ్డి చురక
తెలగుదేశం టార్గెట్గా ప్రతిరోజు ట్వీట్లతో విరుచుకుపడే ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా మరోసారి ట్వీట్లు చేసి వార్తల్లో నిలిచారు. ఈసారి వైయస్ జగన్ పాలన పై, ఖర్చులపై ట్వీట్ చేశారు. తెలుగుదేశం హయాంలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలిసినప్పటికీ ఆ పార్టీ నేతలు విపరీతమైన విలాసవంతమైన ఖర్చులు చేశారని గుర్తు చేశారు. అదుపులేకుండా అప్పులు చేసి రాష్ట్రాన్ని అదోగతి పాలయ్యేలా చంద్రబాబు ప్రభుత్వం పరిపాలించిందని అన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి రూపాయికి లెక్క చెబుతామని చెప్పారు విజయసాయి రెడ్డి.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక వైయస్ జగన్ దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని గట్టిగా చెప్పినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే జగన్ దుబారా ఖర్చులను కట్టడి చేసినట్లు వెల్లడించారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని రూ.2 లక్షల ఖర్చుతో ముగించడంలోనే ఇది స్పష్టంగా కనిపించిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రతి రూపాయి వ్యయానికి అకౌంటబులిటీ ఉంటుందని ట్వీట్ చేశారు. ఇకపై అత్యంత ఖరీదైన హిమాలయా వాటర్ బాటిల్స్ కనిపించవని ఎద్దేవా చేశారు విజయసాయి రెడ్డి. సాధారణంగా చంద్రబాబు సమావేశాలు నిర్వహించిన సమయంలో మంత్రులందరికి సాధారణ మినరల్ వాటర్ బాటిల్స్ ఉంచితే ఒక్క చంద్రబాబు లోకేష్లకు మాత్రం ఖరీదైన హిమాలయా వాటర్ బాటిల్స్ను ఉంచుతారు. దీన్ని పరోక్షంగా గుర్తు చేశారు విజయసాయిరెడ్డి.
మరోవైపు వృద్ధాప్య వితంతు వికలాంగుల పింఛన్లు భారీగా పెంచిన రాష్ట్రంగా ఏపీ దేశంలోనే చరిత్ర సృష్టించిందని మరో ట్వీట్లో పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో తాండవం చేసిన కిడ్నీ సమస్యలను అంతా రాజకీయం కోసం వాడుకున్నారని ధ్వజమెత్తిన విజయసాయి రెడ్డి అలాంటి వారంతా సిగ్గుపడాలని విరుచుకుపడ్డారు. నేను చూశాను..నేను ఉన్నాను అంటూ నెలకు రూ.10వేలు ఆసరా కల్పించిన యువ ముఖ్యమంత్రి జగన్ అని విజయసాయిరెడ్డి కొనియాడారు.