ఒక్క హామీ నెరవేర్చలేదు: బాబుపై విజయసాయి
అనంతపురం: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన 200 హామీల్లో ఇప్పటివరకు ఏ ఒక్కటీ కూడా నెరవేర్చలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. లక్షా 30వేల కోట్ల రూపాయల రుణాలుంటే ప్రభుత్వం కేవలం రూ. 5వేల కోట్లు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
రుణమాఫీ త్వరగా జరగాలన్నదే తమ పార్టీ ఉద్దేశమని ఆయన అన్నారు. నవంబర్ 5న నిర్వహించనున్న ధర్నాలను విజయవంతం చేయాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చిత్తశుద్ధితో పనిచేసే కార్యకర్తలకు పార్టీలో అన్ని విధాలా ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని అన్నారు.
చరిత్రహీనుడిగా మిగులుతారు: బాబుపై ఉమ్మారెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు.
అందువల్లే మంత్రులు గానీ, టిడిపి ఎమ్మెల్యేలు గానీ గ్రామాల్లో ఎక్కడా తిరగలేకపోతున్నారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. తెలుగుదేశం పార్టీని వీడి బయటకు వచ్చేందుకు చాలా మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. బ్యాంకుల్లో రైతులు, మహిళల గౌరవాన్ని చంద్రబాబు భంగపర్చారని దుయ్యబట్టారు.
ఓ వైపు రైతులు తాకట్టు పెట్టుకున్న బంగారాన్ని వేలం వేయిస్తూ.. మరోవైపు రుణమాఫీ పేరుతో కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని ఆరోపించారు. రుణమాఫీ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నేతలు వీడుతున్నారంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మోసం, వంచనలకు మారుపేరు చంద్రబాబు అని అన్నారు. కుల రాజకీయాలను చంద్రబాబు పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు.