మిల్లర్ల నుంచి చినబాబు కమీషన్ వసూల్, మద్యం షాపులను వదల్లేదు: విజయసాయి విసుర్లు...
తూర్పు గోదావరి జిల్లాకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారని వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. జిల్లాకు చంద్రబాబు చేసిన నష్టాన్ని పార్ట్-3లో పోస్ట్ చేశారు. జిల్లాలోని తీర ప్రాంతం చమురు నిక్షేపాలకు కేంద్రం అని.. కానీ చాలా గ్రామాల పరిస్థితి బాగోలేదన్నారు. ఎప్పుడు ఏ గ్యాస్ పైప్ లీకవుతుందో చెప్పలేని పరిస్థితి అని పేర్కొన్నారు. గతంలో చమురు కంపెనీలతో చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో ఇన్నీ నిక్షేపాలున్నాయని.. కంపెనీలతో ఈ ప్రాంతంలో చంద్రబాబు ఖర్చు చేయించలేదన్నారు.
దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ.. రైతులను దగా...
అమలాపురం, ముమ్మిడివరం, రాజోలులో దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ రైతులను చంద్రబాబు దగా చేశాడని ధ్వజమెత్తారు. ఇక్కడ అన్నీ ఉన్నా గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే పరిస్థితి తలెత్తేలా చేశాడని మండిపడ్డారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రతీ నిత్యం గ్యాస్ లీకు జరగడం... గ్రామాలను ఖాళీ చేయించడం జరుగుతూనే ఉంటుందన్నారు. కొందరు చనిపోయారని విజయసాయి వివరించారు. సీఎంగా ఉన్న సమయంలో గ్యాస్ కంపెనీల నుంచి చంద్రబాబు ముడుపులు తీసుకునేవారని ఆరోపించారు.
మారని ప్రజల తలరాత..
గోదావరి పక్కనే ఉన్నా మమ్మిడివరం ప్రజలను మంచినీటి కొరత వేధించిందని విజయసాయి గుర్తుచేశారు. కానీ ఇటువైపు చంద్రబాబు చూసిన దాఖలాలు లేవని విమర్శించారు. అపార చమురు నిక్షేపాలు, పెట్రోలియం వనరలు ఉన్నా ప్రజల తలరాత మాత్రం మారలేదన్నారు. ముమ్మడివరం లంక గ్రామాలకు రవాణా సమస్య వేధిస్తోందని చెప్పారు. కోనసీమ అందాలకు కేరాఫ్ అడ్రస్ అమలాపురం అని.. ఇక్కడ ప్రజలను తరచూ గ్యాస్ లీక్ సమస్యలు వేధిస్తున్నాయని చెప్పారు. దళారీ వ్యవస్థను ప్రోత్సహించడం వల్ల.. కోనసీమ కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. తూర్పు గోదావరి ఆక్వా రైతుల పరిస్థితైతే అధ్వాన్నంగా తయారయ్యిందని వాపోయారు.
హెరిటేజ్ ప్రయోజనాలే ముఖ్యం..
హెరిటేజ్ ప్రయోజనాలే చంద్రబాబుకు ముఖ్యమయ్యాయని.. అందుకే కంపెనీ పెరిగింది గానీ, పాలు, కూరగాయలు, బియ్యం సరఫరా చేసిన రైతులు మాత్రం బక్క చిక్కిపోయారన్నారు. ఆక్వా, కొబ్బరి రైతులు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారని విజయసాయి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ అరాచకాలకు అడ్డే లేదని చెప్పారు. మిల్లర్లు చిన్నబ్బాయి నారా లోకేశ్కు జీఎస్టీ కట్టేవారని ఆరోపించారు. అనపర్తిలో లేఔట్ వేయాలంటే లక్షల్లో చినబాబు ట్యాక్స్ వేసేవారన్నారు.
Recommended Video
మద్యం దుకాణాలను వదల్లేదు
మద్యం దుకాణాల నుంచి వసూళ్లు చేస్తూ... ప్రముఖ ఎడ్యుకేషన్ సెంటర్గా ఉన్న అనపర్తి ఇమేజ్ను దెబ్బ తీశారని ఆరోపించారు.మర్యాదలకు మారు పేరైన రాజోలు చంద్రబాబు హయాంలో తీవ్ర సమస్యలను ఎదుర్కొందన్నారు. తనవాళ్లు పెద్దగా లేరనో ఏమో అని నియోజకవర్గంపై చంద్రబాబు చిన్న చూపు చూశారని ఆరోపించారు. కానీ ఇక్కడ పండే ధాన్యం, కొబ్బరికి గిట్టుబాటు ధర ఇస్తే ఊరుకునేదే లేదన్నట్లు ప్రవర్తించాడని ధ్వజమెత్తారు.