ఏపీకి హామీపై గడ్కరీ, వెంకయ్యపై నిప్పులు చెరిగిన విజయసాయి రెడ్డి
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టును 2019లోగా పూర్తిచేయడం తన బాధ్యతని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం చెప్పారు. బీజేపీ ఎంపీలు కంభంపాటి హరిబాబు, గోకరాజు గంగరాజు, ఏపీ వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఈ రోజు నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు.
Recommended Video
ఏపీ అంటే లెక్కలేదా: మోడీకి బాబు మరో షాక్, బంద్పై యూటర్న్, కానీ, గల్లాకు 'ప్రత్యేక' ప్రశంస
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏపీకి ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేరుస్తామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్కు నిధులు, జాతీయ రహదారులు ఇచ్చామని తెలిపారు.
వెంకయ్యపై విజయసాయి రెడ్డి ఆగ్రహం
రాజ్యసభలో వైస్ చైర్మన్ వెంకయ్య నాయుడు తీరుపై వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి మండిపడ్డారు. పార్లమెంటు ప్రాంగణంలో విజయసాయి మాట్లాడుతూ వెంకయ్య తీరును తప్పుబట్టారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ పైన రాజ్యసభ ఛైర్మన్ తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ఛైర్మనే నిబంధనలను అమలు చేయకపోతే ఎలా అని అసహనం వ్యక్తం చేశారు.
ఫిర్యాదు చేస్తాం
ఛైర్మన్ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని విజయసాయి రెడ్డి అన్నారు. ఒక మంత్రి మరొక మంత్రికి సలహా ఇవ్వడం ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమే అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న చర్యను ఛైర్మన్ ఎలా సమర్థిస్తారన్నారు. సుజన ప్రసంగంపై రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.
ఏం జరిగిందంటే
కాగా, అంతకుముందు రాజ్యసభలో విజయసాయి మాట్లాడుతూ.. సుజనా చౌదరి కేబినెట్లో ఉండి మంత్రివర్గ నిర్ణయాన్ని ప్రశ్నించారని, అవసరమైతే ఆయన రాజీనామా చేసి మాట్లాడాలని చెప్పారు. అయితే సుజన సూచన చేశారని, నిరసన వ్యక్తం చేయలేదని వెంకయ్య అసహనం వ్యక్తం చేశారు. దీనిపై సాయి రెడ్డి పార్లమెంటు బయట స్పందించారు.
విజయసాయిపై సీఎం రమేష్
పార్లమెంటులో శుక్రవారం కూడా తమ ఆందోళన కొనసాగిస్తామని టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. పార్లమెంటులో ఏనాడైనా విజయసాయి రెడ్డి నిరసన తెలిపారా అని ప్రశ్నించారు. ఏపీకి కేంద్రం నుంచి ప్రయోజనాలు అందకుండా చేసేందుకు వైసీపీ నేతలు ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. నిన్న నన్ను రాజ్యసభలో మార్షల్స్ తనను బయటకు తీసుకెళుతుంటే అందరూ ఖండిస్తోంటే వైసీపీ ఎంపీ మాత్రం ఏమీ అడగలేదని అన్నారు. ఏపీకి ఏ మాత్రం మేలు జరగకుండా ఉండాలనేదే వైసీపీ ఆలోచనని సీఎం రమేశ్ ధ్వజమెత్తారు. పార్లమెంటులో తమ పోరాటం ఇక ముందు కూడా కొనసాగుతుందన్నారు. విభజన హామీలపై మరింత స్పష్టత ఇవ్వాలని గట్టిగా కోరుతున్నామన్నారు.