చంద్రబాబు రెండు నాల్కల ధోరణి.. వీడియోల సాక్ష్యాలు ఇవే.. విజయసాయి రెడ్డి విమర్శల దాడి
అమరావతి: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. ఏపీలో శాసనమండలి రద్దు నేపథ్యంలో చంద్రబాబు అనుకూల మీడియా ద్వంద్వ విధానాలు పాటిస్తోందంటూ మండిపడ్డారు.
వీడియోల సాక్షిగా చంద్రబాబు రెండు నాల్కల దోరణి
‘ఎన్టీఆర్ మండలిని రద్దు చేసిన విషయాన్నిఎల్లో మీడియా, బాబు గ్యాంగ్ ప్రస్తావించడం లేదు. వైఎస్సార్ గారు పునరుద్ధరించడాన్ని పదేపదే చెబుతున్నారు. 1985, 2005లో రెండు సందర్భాల్లో మండలి ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఉపన్యాసం దంచాడు. మీ రెండు నాల్కల ధోరణి వీడియోల సాక్షిగా బయటపడిందిప్పుడు' అంటూ చంద్రబాబుపై విజయసాయి విమర్శలు గుప్పించారు.
నిప్పులు పోసుకుంటున్నారెందుకు చంద్రబాబు?
‘జీవనోపాధి లేక వలసలు వెళ్లే ఉత్తరాంధ్ర ప్రజల మీద నిప్పులు పోసుకుంటున్నారెందుకు చంద్రబాబు? ఈనాడు, చంద్రజ్యోతిలతో జిఎన్ రావు కమిటీని వక్రీకరించే రాతలు రాయించారు. ముంబై, చెన్నైలకు కూడా తుఫాను తాకిడి ఉంది. విశాఖకు అంతే. అగ్నిపర్వతం అంచున ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారెందుకు?' అని విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీతిచంద్రికల బండారం బట్టబయలు..
‘భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రకటనకు ముందే ఇన్సైడర్ ట్రేడింగులో చంద్రబాబు బినామీలు చుట్టుపక్కల భూములను చుట్టేశారు. దానిపైనా విచారణ జరిగితే నీతిచంద్రికల బండారం బయట పడుతుంది. విశాఖలో నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన అనుమతులు, కోస్టల్ రెగ్యులేషన్ల అతిక్రమణలు, మీరు చేయని అక్రమాలు లేవు' అని అంటూ చంద్రబాబుపై విజయాసాయి రెడ్డి విమర్శలతో విరుచుకుపడ్డారు.
Recommended Video
మూడు రాజధానులు, మండలి రద్దును వ్యతిరేకిస్తూ చంద్రబాబు
కాగా, వైసీపీ సర్కారు ముందుకు తీసుకొచ్చిన మూడు రాజధానుల నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు మొదట్నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. మూడు రాజధానుల బిల్లు, శాసనమండలి రద్దు తీర్మానంకు ఏపీ అసెంబ్లీ ఆమోదం కూడా తెలిపింది. మండలిలో టీడీపీ సభ్యులు ఎక్కువగా ఉండటం, మూడు రాజధానుల బిల్లును అడ్డుకుంటుందనే కారణంతో మండలిని రద్దు చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించుకుంది. ఇప్పటికే మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపింది. అటు మూడు రాజధానుల అంశం, ఇటు మండలి రద్దుపై చంద్రబాబు వైసీపీ సర్కారు లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా మండిపడుతున్నారు.