చంద్రబాబు కష్టం పగోడికీ రాకూడదు: ‘ప్యాకేజీ స్టార్’ అంటూ పవన్పై విజయసాయి తీవ్ర విమర్శలు
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. నవంబర్ 3న విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ లాంగ్ మార్చ్లో చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు పలువురు టీడీపీ నేతలు కూడా పాల్గొని మద్దతు పలికిన విషయం తెలిసిందే.
రెండు వారాలు చూస్తాం..టెంట్లు వేస్తాం: అవంతి..కన్నబాబు అలా ఉండేవారు: సీఎస్ పై వేటు దేనికి: పవన్ ఫైర్
పవన్ లాంగ్ మార్చ్ని చూసి నవ్వుకుంటున్నారు..
ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ‘లాంగ్ మార్చ్ పేరుతో 1934 లో చైనా కమ్యూనిస్ట్ ప్రజా విమోచన సైన్యం మావో నాయకత్వంలో పది వేల కిలోమీటర్లు నడిచి అధికారం సాధించింది. రెండున్నర కిలోమీటర్లు నడిచే @PawanKalyan ఇసుక ఆందోళనను లాంగ్ మార్చ్ అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు' అని విజయసాయి ఎద్దేవా చేశారు.
పాపం చంద్రబాబు కష్టాలు పగోడీకి రాకూడదు..
‘పాపం @ncbn కష్టాలు పగోడికి కూడా రావొద్దు. పేమెంటు తనే ఇవ్వాలి. పచ్చ మీడియా కవరేజి బాధ్యత చూసుకోవాలి. కార్యకర్తలను తనే తరలించాలి. ప్రజలకు ఇద్దరి అనుబంధం తెలిసిన తర్వాత కూడా ఏదో ఒక హడావుడి చేయాలి కాబట్టి దత్తపుత్రుడిని ముందుకు నెట్టాడు. లాంగ్ మార్చ్ కాస్త తుస్సుమంది' అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్యాకేజీ స్టార్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు..
‘చంద్రబాబునాయుడు స్క్రిప్ట్ తో వైజాగ్ షో పూర్తి అయిందనిపించాడు ప్యాకేజి స్టార్. రాజకీయాల్లో ‘కాల్షీట్' సంస్కృతిని ప్రవేశపెట్టిన వ్యక్తులు నీతి, నిజాయితీల గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎన్నికల్లో ఓడినంత మాత్రాన తక్కువ చేసి చూడొద్దట.ఈ మాట ప్రజలను అడుగుతున్నావా?' అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. నవంబర్ 3న విశాఖలో ఇసుక కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీకి భారీ ప్రజలు, కార్యకర్తలు హాజరయ్యారు.