లండన్లో మాల్యాతో బాబు భేటీ, రూ.కోట్ల విరాళం!: విజయసాయి సంచలనం, ‘ఢిల్లీకి అందుకే’
Recommended Video
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అవిశ్వాసంపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యానించారు. అవిశ్వాసంపై చర్చ జరగకుండా టీడీపీనే అడ్డుకుంటోందని ఆరోపించారు.
లిక్కర్ కింగ్, బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా వద్ద డబ్బులు తీసుకున్నారంటూ చంద్రబాబుపై విజయసాయి సంచలన ఆరోపణలు చేశారు.
కొత్త పాట్నర్ కోసం బాబు
ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. దుర్మార్గపు సీఎం, ఏపీ ప్రజలను మోసం చేసిన సీఎం ఢిల్లీకి రాబోతున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. గతంలో అన్ని పార్టీలతో మితృత్వం చేసి.. అందరికీ విడాకులు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి కొత్త భాగస్వామి కోసం ఢిల్లీకి వస్తున్నారని అన్నారు.
అందుకే ఢిల్లీకి బాబు
ఏపీ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఢిల్లీకి రావడం లేదని విజయసారెడ్డి ఆరోపించారు. నాలుగేళ్ల దుర్మార్గపు పాలన, ఓటుకు నోటు, పోలవరం అవినీతి, వంటి విషయాలు బయటపడకుండా ఉండేందుకే బాబు ఢిల్లీ పర్యటన అని అన్నారు. ఏపీలోని వామపక్షాలు జాతీయ పార్టీలకు చంద్రబాబు దుర్మార్గాల గురించి చెప్పాలని అన్నారు. తాను ప్రధాని మోడీని కలిస్తే తప్పుపట్టిన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి.. ఆయనను జైట్లీని ఎందుకు కలిశారని అడిగితే మాత్రం అది వేరే అంటున్నారని విజయసాయి రెడ్డి చెప్పారు.
బాబూ.. మాల్యాను కలవ లేదా?
విజయ్ మాల్యా 2016లో రాజ్యసభలో ఉన్నారని, అదే సంవత్సరం మార్చిలో లండన్ పారిపోయారని తెలిపారు. 2016, మార్చి 12, 13, 16 తేదీల్లో చంద్రబాబు నాయుడు.. విజయ్ మాల్యాను లండన్లో కలిశారా? లేదా అని విజయసాయి ప్రశ్నించారు.
బాబూ.. మాల్యా నుంచి రూ.150కోట్లు తీసుకోలేదా?
రూ. 9వేల కోట్లు మోసం చేసిన మాల్యా నుంచి రూ.150కోట్ల విరాళాలు సేకరించలేదా? అని నిలదీశారు. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పకుంటే తన ఆరోపణలు నిజమేనని భావించాల్సి ఉంటుందని అన్నారు. తాను రాజ్యసభలో సీఎం చంద్రబాబుపై ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.
అన్నాడీఎంకే ఎంపీలను కోరినా..
మరో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. 9వ రోజు కూడా లోకసభలో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చామని తెలిపారు. స్పీకర్.. సభ సజావుగా సాగడం లేదని వాయిదా వేస్తున్నారని అన్నారు. అన్నాడీఎంకే ఎంపీలతో మాట్లాడానని, కానీ, తమకు న్యాయం జరిగే వరకూ ఆందోళన ఆపబోమని వారు చెప్పారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 10నిమిషాలు సహకరించాలని కోరినా.. కావేరి సమస్య పరిష్కారం అయ్యే వరకూ తమ ఆందోళన కొనసాగిస్తామని వారు తెలిపారని చెప్పారు.
ఎన్డీఏకు చెక్ పెట్టేందుకే బాబు
మంగళవారం అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందని తాము భావిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు ఢిల్లీ వస్తున్నారని తెలిసిందని.. వచ్చి ఏం చేస్తారో చూద్దామని అన్నారు. ప్రధానిపై ఒత్తిడి తెస్తారో.. పార్టీల మద్దతు కూడకడతారో.. యూటర్న్ తీసుకుంటారో చూద్దామని అన్నారు. తనపై కేసులు పెడుతుందనే ఎన్డీఏ ప్రభుత్వానికి చెక్ పెట్టడానికి చంద్రబాబు ఢిల్లీ వస్తున్నారని అన్నారు. పార్లమెంటు సమావేశాల చివరి రోజున తాము రాజీనామాలు చేసి దీక్ష చేపడతామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.