జగన్ కు ధైర్యం లేకనే ప్రధాని పేరుతో : సాయిరెడ్డి పక్కదోవ పట్టించారా: రాజకీయ కలకలం...!!
ఏపీ రాజకీయాల్లో మరో వివాదం పుట్టుకొచ్చింది. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల పైన తాజాగా వైసీపీ ఎంపి విజయ సాయి రెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. తాము ప్రధాని మోదీ.. హోం మంత్రి అమిత్ షా అనుమతితోనే నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేసారు. దీంతో..ఒక్క సారిగా రాజకీయ కలకలం రేగింది. ముఖ్యమంత్రి జగన్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల సమీక్ష.. పోలవరం నుండి నవయుగను తప్పించటం..పోలవరం లో రివర్స్ టెండరింగ్ వంటి నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. అన్ని రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పించారు. అయితే, తాజాగా సాయి రెడ్డి వ్యాఖ్యలతో వివాదం కొత్త టర్న్ తీసుకుంది. బీజేపీ నేతలు మాత్రం జగన్ ను తానే నిర్ణయం తీసుకున్నానని చెప్పే ధైర్యం లేక ప్రధాని..అమిత్ షా పేర్లు వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. దీని పైన ప్రధానికి ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. ఇంతకీ ఏది నిజం.. సాయిరెడ్డి అవాస్తవాలతో ఏకంగా ప్రధాని పేరు ప్రస్తావించారా...
సాయిరెడ్డి వ్యాఖ్యలతో బీజేపీ ఎదురుదాడి..
కొద్ది రోజులుగా ఏపీలో ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఏపీలోని రాజకీయ పార్టీలే కాకుండా..కేంద్ర మంత్రులు..అధికారులు..జపాన్ సంస్థలు.. పొరుగు రాష్ట్ర పారిశ్రామిక వేత్తలు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేసారు. జగన్ నిర్ణయాలను తప్పు బట్టారు. దీని మీద ముఖ్యమంత్రి జగన్ విజయవాడలో జరిగిన రాయబారుల సమావేశంతో పాటుగా స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనూ ప్రస్తావించారు. ధరలు తగ్గించేందుకు..అవినీతిని నియంత్రించేందుకు తాను చర్యలు తీసుకుంటుంటే గగ్గోలు పెడుతున్నారంటూ జగన్ వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ విషయంలోనూ ఎన్ని అభ్యంతరాలు వచ్చినా..పోలవరం ప్రాజెక్టు అధారిటీ లేఖ రాసినా ఏపీ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో.. తమను పోలవరం పనుల నుండి తప్పించటం పైన నవయుగ కోర్టును ఆశ్రయించింది. ఇదే సమయంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రధాని మోదీ..హోం మంత్రి అమిత్ షా అనుమతి తోనే తాము నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. ఇప్పుడు ఇదే కొత్త వివాదానికి కారణమైంది.
జగన్ కు దైర్యం లేకనే..మోదీ పేరు చెప్పించారు..
విజయ సాయిరెడ్డి తమకు ప్రధాని మోదీ..హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని చెప్పటం ఏపీలోని బీజేపీ నేతలకు రుచించటం లేదు. తాము ఇప్పటి వరకు జగన్ తీసుకున్న నిర్ణయాల పైన విమర్శలు చేస్తుంటే..సడన్ గా ప్రధాని..అమిత్ షా తమకు సమాచారం ఇవ్వకుండా జగన్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వరనేది వారి నమ్మకం. దీంతో..కొద్ది కాలం క్రితం టీడీపీ నుండి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి విజయ సాయి రెడ్డి వ్యాఖ్యలతో విభేదించారు. ప్రధాని అనుమతితోనే చేసి ఉంటే పోలవరం ప్రాజెక్టు అధారిటీ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తుందని ప్రశ్నించారు. తాను ఇదే విషయం పైన ప్రధాని మోదీ..అమిత్ షా తో చర్చిస్తానని స్పష్టం చేసారు. ఇక, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైతం విజయ సాయిరెడ్డి వ్యాఖ్యల మీద స్పందించారు. జగన్ తాను తీసుకున్న నిర్ణయాలు తానే తీసుకున్నానని చెప్పే ధైర్యం లేకనే..ప్రధాని పేరును వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రధాని అనుమతి ఉంటే పీపీఏ ల విషయంలో కేంద్ర మంత్రి స్వయంగా ఎందుకు లేఖ రాస్తారని.. నిర్ణయం మార్చుకోమని ఎందుకు కోరుతారనిన కన్నా ప్రశ్నిస్తున్నారు. విజయ సాయి రెడ్డి వ్యాఖ్యల గురించి పార్టీ అధినేతతో చర్చిస్తానని కన్నా అంటున్నారు. విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను నమ్మటం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రధానిని కలవక ముందే పీపీఏ ల నిర్ణయం తీసుకున్నారని కన్నా అంటున్నారు.
ఏది నిజం.. ఢిల్లీలో ఏం జరిగింది.
ప్రధాని మోదీతో..హోం మంత్రి అమిత్ షా తో చర్చించకుండానే.. వారి పేర్లను విజయ సాయి రెడ్డి ప్రస్తావిస్తారా అనే చర్చ మొదలైంది. ప్రధాని మోదీ..అమిత్ షా తో సన్నిహిత సంబంధాలు నడుపుతున్న విజయ సాయి రెడ్డి ఆ రకంగా వ్యవహరించరనే వాదన వైసీపీ నేతల నుండి వినిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ తన ఢిల్లీ పర్యటనలో ప్రధానితో సమావేశమైన సమయంలోనే అన్ని విషయాలను చర్చించారని.. ఆయనకు చెప్పిన తరువాతనే ముందుకు వెళ్లారని వైసీపీ ఎంపీలు సైతం చెబుతున్నారు. జగన్ ఢిల్లీ పర్యటన సమయంలో అమిత్ షా అందుబాటులో లేకపోవటంతో ఆయన కోసం మరో రోజు నిరీక్షించి జగన్ మొత్తం విషయాలను వివరించారని పార్టీ ఎంపీలు గుర్తు చేస్తున్నారు. అయితే, సాధారణంగా జరిగే ప్రక్రియలో ప్రధాని స్థాయి లో ఉన్నవారు జోక్యం చేసుకోరని విశ్లేషకుల అభిప్రాయం. తుది నిర్ణయం సమయానికి మాత్రమే వారు తమ నిర్ణయం చెబుతారని వారంటున్నారు. విజయ సాయి రెడ్డి అంత సులువుగా..రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాని..హోం మంత్రి..ముఖ్యమంత్రి గురించి వ్యాఖ్యానించే పరిస్థితి ఉందడని.. బీజేపీ నేతలకు విచారించుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. అమరావతిలో రాజకీయాలు..ఢిల్లీలో నిర్ణయాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. దీంతో..ముఖ్యమంత్రి అమెరికా పర్యటన నుండి తిరిగి వచ్చిన తరువాత వీటన్నింటికీ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.