మరో ఎమ్మెల్యే షాక్?: 'బాబుకు లొంగొద్దు, జగన్కు చెప్పండి.. వెళ్లనీయండీ'
విజయనగరం: బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు దారిలోనే సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర.. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. సుజయను కలిసేందుకు వైసిపి నేతలు విజయ సాయి రెడ్డి చెవిరెడ్డి భాస్కర రెడ్డిలు విజయనగరం వచ్చారు.
సుజయ వారిని కలిసేందుకు ఆసక్తి కనబర్చలేదు. ఆ తర్వాత వారు సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొరను కూడా కలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ గురి చేసే ప్రలోభాలకు లొంగవద్దని, పార్టీ పరంగా ఏమైనా సమస్యలు ఉంటే జగన్తో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారని తెలుస్తోంది.
దానికి ఎమ్మెల్యే రాజన్న దొర తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. అనంతరం విజయ సాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీలు మారేవారు రాజీనామా చేసి ఆ తర్వాత ఏ పార్టీలోకి అయినా వెళ్లవచ్చునని చెప్పారు. ఫిరాయించిన వారు రాజీనామా చేసి గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు.
పెద్దిరెడ్డి ఇంకా మాట్లాడుతూ... పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి తిరిగి గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తిన్నింటివాసాలు లెక్కపెట్టేవారు వెళ్లిపోవడం వల్ల పార్టీకి మంచే జరుగుతుందన్నారు. వారు వెళ్తేనే మేం బాగుపడతామన్నారు.
జగన్ ఆలస్యంగా లేచారా?
వైసిపి అధినేత జగన్ తన పార్టీ నుంచి వెళ్లిపోతున్న ఎమ్మెల్యేల విషయంలో ఆలస్యంగా నిద్రలేచారనే వాదనలు వినిపిస్తున్నాయి. తొలిసారి ఎమ్మెల్యేలు టిడిపి దారి పట్టినప్పుడే ఆయన ఇప్పుడు స్పందించినట్లుగా స్పందిస్తే బాగుండేదని అంటున్నారు.
దూళిపాళ్లను అడ్డుకున్న వైసిపి కార్యకర్తలు
ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అడ్డుకునేందుకు వైసిపి కార్యకర్తలు గురువారం యత్నించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఇది జరిగింది. పొన్నూరులోని ఐలాండ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నరేంద్ర పూలమాల వేశారు. అనంతరం అక్కడి నుంచి వస్తున్న ఆయన్ని వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు చెదరగొట్టడంతో వివాదం సమసిపోయింది.