ఇది మరో అపూర్వ ఘట్టం: విజయ సాయి రెడ్డి, వారిని రెండ్రోజుల పాటు అరెస్ట్ చేశారని..
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ యాత్ర నేటితో 250 రోజులు పూర్తయ్యాయని, ఇది అపూర్వఘట్టమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి గురువారం అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
'ప్రజా సంకల్ప యాత్రలో మరో అపూర్వ ఘట్టం! 250 రోజులు...11 జిల్లాలు... 2848 కి.మీ. గత ఏడాది నవంబర్ 6న మన అధినేత శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయలో ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్రకు నేటితో 250 రోజులు పూర్తయ్యాయి.
ఆయన మరో ట్వీట్లో.. ఇటీవల మైనార్టీ సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు వినిపించిన యువకులను రెండు రోజుల పాటు అదుపులోకి తీసుకున్నారని విమర్శించారు. వారిపై తప్పుడు కేసులు పెట్టారన్నారు.
టీడీపీ ప్రభుత్వంపై బొత్స ఆగ్రహం
టీడీపీ నాలుగేళ్ల పాలనలో జిల్లాలోగాని, చీపురుపల్లి నియోజకవర్గంలోగాని జరిగిన అభివృద్ధి శూన్యమని వైసీపీ వైత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మెరకముడిదాంలో రూ.3లక్షలతో నిర్మించిన తొమ్మిది అడుగుల దివంగత మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆయన బుధవారం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ పరిపాలనలో ఆ పార్టీ గ్రామ స్థాయి నేతల నుంచి అందరూ దోచుకొని, దాచుకునే విధానం పాటిస్తున్నారన్నారు.
గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో ఒక్క మెరకముడిదాం గ్రామంలోనే 850 ఇళ్లను పేదలకు ఇచ్చామన్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు కనీసం అందులో పది శాతం ఇళ్లు 85 కూడా మంజూరు చేయలేదన్నారు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం ఆలోచన చేస్తూ, పేదల అభివృద్ధికే పాటుపడుతున్న జగన్ను వచ్చే ఎన్నికల్లో దీవించాలన్నారు.