చంద్రబాబుపై పోటీ చేస్తా, ఏటీఎం డబ్బులు ఆయన ఖాతాల్లోకి: విజయసాయి సంచలనం
విశాఖపట్నం: పార్టీ అధినేత వైయస్ జగన్ ఆదేశిస్తే తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై పోటీ చేసేందుకు సిద్ధమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి గురువారం తెలిపారు. జగన్ చేపడుతున్న ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా గాజువాకలో ఆయన సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు.
ఇక నాకు వద్దు: బాబుకు గల్లా అరుణ ఝలక్, టీడీపీలో కుదుపు! కారణాలు ఇవేనా?
ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉందని తెలిపారు. తమ పాదయాత్రలకు వస్తున్న స్పందననే దీనికి నిదర్శనం అన్నారు. విభజన హామీల్ని నెరవేర్చని కేంద్రంతో నాలుగేళ్లుగా ఎలా కలిసి ఉన్నారో చంద్రబాబు ప్రజలకు చెప్పాలన్నారు. ఇప్పటి వరకు కేంద్రంలో పదవులు అనుభవించి, ఇప్పుడు మళ్లీ హోదాపై యూటర్న్ తీసుకోవడం విడ్డూరమన్నారు.
నిప్పునాయుడు, పప్పునాయుడు అంటూ విమర్శలు
చంద్రబాబును నిప్పు నాయుడు, లోకేష్ను పప్పు నాయుడు అంటూ విజయసాయి విమర్శలు గుప్పించారు. నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు రూ.3 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అన్ని వర్గాలను టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. నిప్పు నాయుడు-పప్పు నాయుడు ఇద్దరూ అవినీతికి మారుపేరుగా నిలిచారన్నారు. విశాఖకు సంబంధించి పలు అంశాలను పార్లమెంట్లో లెవనెత్తి వాటిని పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేశామన్నారు.
అవినీతి ఆర్జనపై దృష్టి
తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, కానీ అభివృద్ధితో పాటు కాలుష్యాన్ని నివారించే చర్యలు తీసుకోవాలని విజయ సాయి రెడ్డి అన్నారు. ప్రజలు వివిధ రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పరిశ్రమలు నెలకొల్పి, స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు చూపించిన వ్యక్తి వైయస్ రాజశేఖర రెడ్డి అని, కాని స్థానిక ఎమ్మెల్యే అవినీతి ఆర్జనపై దృష్టి సారించారన్నారు. ఈ పరిస్థితులు మారాలంటే వైసీపీ అధికారంలోకి రావాలన్నారు. కొండవాలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడేలా ఉన్నాయని, దానిపై దృష్టి పెట్టలేదని స్థానిక ఎమ్మెల్యేపై మండిపడ్డారు.
జగన్ సీఎం కావాలి
చంద్రబాబు తన నాలుగేళ్ల పాలనలో ఒక్క ఇల్లు కట్టించిన పాపాన పోలేదని, తన పార్టీ నేతలకే ఆయన లబ్ధి చేకూర్చారన్నారు. విశాఖపట్నంలోనే ఎక్కువ కుంభకోణాలు జరిగాయన్నారు. హిందూస్తాన్ షిప్ యార్డును ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టడంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారన్నారు. గతంలో షిప్ యార్డు నష్టాల్లో కూరుకుపోయిందని రక్షణశాఖకు అప్పగించి వైయస్ ఎంతోమంది ఉద్యోగాలు కాపాడారన్నారు. అలాంటి పాలన రావాలంటే జగన్ సీఎం కావాలన్నారు.
చంద్రబాబులో హిట్లర్ పరకాయ ప్రవేశం
గత నాలుగేళ్లుగా చంద్రబాబు - లోకేష్లు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఇద్దరూ అవినీతికి మారుపేరుగా నిలిచారన్నారు. పరమక్రూరుడైన హిట్లర్ పుట్టిన రోజు నాడే చంద్రబాబు పుట్టారన్నారు. ఆయనలాగే చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. హిట్లర్ మంత్రివర్గంలో గోబెల్స్ పని చేశారని, ఆయన అబద్దాలను నిజాలుగా ప్రచారం చేశారని, ప్రస్తుతం ఆ హిట్లర్ - గోబెల్స్లు చంద్రబాబులో పరకాయ ప్రవేశం చేశారన్నారు. తన సామాజిక వర్గానికి తప్ప ఎవరికీ ప్రయోజనం ఆయన ఎవరికీ ప్రయోజనం చేకూర్చలేదన్నారు.
దొంగసొమ్ము దాచి, ఎటీఎంలలో డబ్బుల్లేవంటావా?
ఎన్నికల కోసం దొంగ సొమ్మును చంద్రబాబు దాచి పెట్టారని, కానీ ఏటీఎంలలో డబ్బులు లేవని ఆరోపిస్తున్నారని విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏటీఎంలలో డబ్బులు ఎందుకు లేవంటే దానికి వైసీపీనే కారణం అంటుంటారని మండిపడ్డారు. కానీ వాస్తవం వేరు అన్నరు. కేంద్రం నుంచి డబ్బులు రాగానే కేవలం తన పార్టీకి, తన వ్యక్తిగత లబ్ధి చేకూర్చే అంశాలకు ఖర్చు చేయడం వల్ల ఏటీఎంలు, బ్యాంకుల్లో డబ్బుల్లేవన్నారు. ఆర్బీఐ వద్ద కూడా రూ.500, రూ.2000 నోట్లు లేవని, ఆ డబ్బు అంతా చంద్రబాబు ఖజానాలోకి పోయిందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల కోసం దొంగ సొమ్మును ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
బాబు వ్యాఖ్యలు ఆశ్చర్యం
వచ్చే ఎన్నికల్లో ఓటుకు రూ.5వేలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు స్వయంగా చెప్పారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయన్నారు. బీసీలు అంటే ఎంతో ప్రేమ అని కబుర్లు చెబుతారని, కానీ వారికి చేసిందేమీ లేదన్నారు. చంద్రబాబు దృష్టిలో బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదని, బాబు గారి క్లాస్ మాత్రమే అన్నారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమం రాగానే కంటితుడుపు చర్యగా బీసీలకు కొంత కేటాయించారన్నారు. వైయస్ ఫీజు రీయింబర్సుమెంట్స్ తీసుకు వస్తే చంద్రబాబు నారాయణ సంస్థలకు తోడ్పాటు అందించారన్నారు. జగన్ అధికారంలోకి వస్తే ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేస్తారన్నారు.