శవ రాజకీయాలకు జంతువులనూ వదలని చంద్రబాబు .. జగన్ మైనింగ్ మాఫియా పోస్ట్ పై సాయిరెడ్డి పంచ్
టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై, వైసిపి మైనింగ్ మాఫియాపై విరుచుకుపడుతున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా మైనింగ్ మాఫియాపై షాకింగ్ పోస్ట్ లు పెట్టిన చంద్రబాబు నాయుడుకి వైసీపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డిషాకింగ్ పంచ్ వేశారు. సైరా పెంచ్ పేరుతో చంద్రబాబు చేసిన పోస్ట్ కు, రివర్స్ కౌంటర్ ఇచ్చారు.
అక్రమ మైనింగ్ లో మైలవరం వీరప్పన్ .. వైఎస్ బీజం వేస్తే జగన్ పెంచి పెద్దది చేశారు : పట్టాభి ధ్వజం
ఎలుగుబంట్లను వాహనాలతో తొక్కించిన వైసీపీ మైనింగ్ మాఫియా : చంద్రబాబు
జగన్ మైనింగ్ మాఫియా అటవీ ప్రాంతంలో మైనింగ్ కు పాల్పడుతూ రెండు ఎలుగుబంట్లను భారీ వాహనాలతో తొక్కించి చంపేసిందని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. అంతేకాదు వారి క్రూరత్వం అక్కడితో ఆగలేదు అని పేర్కొన్న చంద్రబాబు వాటిని భమిడిక గ్రామంలోని చెట్ల పొదల్లో పడేసినట్లుగా పేర్కొన్నారు. ఈ సంఘటన తెలిసి తను బాధపడ్డానని, షాక్ కు గురయ్యానని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటికే అటవీ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ పై నిప్పులు చెరుగుతున్నారు చంద్రబాబు.
నోరు లేని మూగ జీవాల ప్రాణం తీస్తున్న మైనింగ్ మాఫియా : చంద్రబాబు
ఇదే సమయంలో సర్లంక అటవీప్రాంతంలో లాటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయని, భారీ వాహనాలను వినియోగించటం వల్ల చాలా వన్యప్రాణులు ఆ వాహనాల కింద పడి చనిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానిక నివాసితులు చెబుతున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైసిపి మైనింగ్ మాఫియా నోరులేని రక్షిత మూగజీవాలను చంపే ఈ దౌర్జన్యంతో కూడుకున్న, అమానవీయ చర్యలను నిలిపివేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు.
మూగజీవాలను వదలని చంద్రబాబు : సాయిరెడ్డి కౌంటర్
ఇక చంద్రబాబు చేసిన పోస్ట్ కి రివర్స్ కౌంటర్ వేసిన విజయసాయిరెడ్డి భారీ వాహనాలు ఎలుగుబంటి మీదగా వెళితే నలిగిపోతాయి కదా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు సార్ అంటూ సైరా పంచ్ వేశారు. ఇదే సమయంలో చుక్క రక్తం లేకుండా జంతువు ఎలా చనిపోయిందో చెప్పాలని ప్రశ్నించారు.శవ రాజకీయాలకు జంతువులనూ వదలని చంద్రబాబు అంటూ విజయ సాయి రెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు. మైనింగ్ ను అడ్డుకోవడానికి చంద్రబాబు నోరులేని మూగజీవాలను ఆయుధంగా వాడుతున్నారని విజయ సాయి రెడ్డి విమర్శించారు.
అక్రమ మైనింగ్ పై నిత్యం జగన్ సర్కార్ ను ఎటాక్ చేస్తున్న చంద్రబాబు . . వదలని సాయిరెడ్డి
జగన్ సర్కార్ హయాంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని గత కొంత కాలంగా టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. వైసీపీ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు. నిత్యం ఏదో ఒక వ్యవహారంలో అధికార పార్టీని ఇరికిస్తూ టార్గెట్ చేస్తున్నారు. మొదట విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై పోరాటం చేసిన టీడీపీ, తాజాగా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ వ్యవహారంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఇక ఇప్పుడు అక్రమ మైనింగ్ పేరుతో అడవులను నాశనం చేస్తున్నారని, మూగ జీవాల ఉసురు తీస్తున్నారని టార్గెట్ చేస్తున్నారు. దీంతో సాయిరెడ్డి చంద్రబాబుకు రివర్స్ ఎటాక్ ఇస్తున్నారు.