రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక: విజయసాయి కీలక ప్రకటన, ఇరకాటంలో బాబు
Recommended Video
అమరావతి/న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఎన్డీయే కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తుందని తెలుగుదేశం సహా అన్ని పార్టీలు భావించాయి. కానీ వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి మంగళవారం ఊహించని షాకిచ్చారు.
బీజేపీ, ఎన్డీయే కూటమిలోని పార్టీలు కూడా వైసీపీపై ఎంతోకొంత ఆశతో ఉన్నాయి. వారి ఆశలపై విజయసాయి నీళ్లు చల్లారు. తాము రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీయేకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఈ ఎన్నికల్లో వారి అభ్యర్థికి మద్దతిచ్చేది లేదని తేల్చి చెప్పారు.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్పై బీజేపీ వ్యూహాత్మకం: కేసీఆర్కు నితీష్ ఫోన్
రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షం అభ్యర్థి
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రేసులో ఎన్డీయే తరఫున జేడీయు ఎంపీ హరివంశ్ నారాయణ సింగ్ నిలిచారు. హరివంశ్ తరఫున జేడీయు నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రంగంలోకి దిగారు. పలువురు పార్టీ అధినేతలకు ఫోన్ చేసి మద్దతు కూడగడుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం తెలంగాణ సీఎం కేసీఆర్కు ఫోన్ చేశారు. ఆయన సాయంత్రం నిర్ణయం తీసుకోనున్నారు.
మద్దతుపై ఎన్నో ఆశలు
నితీష్ కుమార్ తమ పార్టీ నేత తరఫున ఓవైపు అందరి మద్దతు కూడగడుతున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఎన్డీయే అభ్యర్థి కాబట్టి ఆయన గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ అభ్యర్థికి కాకుండా ఎన్డీయేలో ఇతర పార్టీ అభ్యర్థి అయితే మద్దతిస్తారని చాలామంది భావించారు. కానీ విజయసాయి మాత్రం ఎన్డీయే అభ్యర్థికి మద్దతిచ్చేది లేదని తేల్చి చెప్పారు.
చంద్రబాబును ఇరకాటంలో పడేసిన విజయసాయి
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో వైసీపీ కీలక, ఊహించని నిర్ణయం తీసుకోవడంతో టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఇరుకునపెట్టినట్లుగా భావిస్తున్నారు. 2019 ఎన్నికల నాటికి ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటి పైకి రావాలని ఆయన కోరుకుంటున్నారు. చంద్రబాబుతో పాటు మమతా బెనర్జీ, కేసీఆర్, దేవేగౌడ, శరద్ పవార్, కేజ్రీవాల్ వంటి చాలామంది నేతలు కోరుకుంటున్నారు. నితీష్ ప్రస్తుతానికి ఎన్డీయేలోనే ఉన్నారు. లోకసభ ఎన్నికల టిక్కెట్ల కోసం బీజేపీ, జేడీయు మధ్య చర్చలు కూడా సాగుతున్నాయి. కానీ నితీష్ చాలా కీలకమైన నేత. ఎన్డీయేలో ఉన్నప్పటికీ అలాంటి వ్యక్తిని ఎన్డీయేకు దూరం చేసి, మోడీ - అమిత్ షాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టే అవకాశం ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడే ఉంటుందని అంటున్నారు. ఓ వైపు తాను వ్యతిరేకించే బీజేపీ కూటమిలోని ఎన్డీయే అభ్యర్థి. మరోవైపు నితీష్ వంటి కీలక నేత. ఇంకోవైపు, యూపీఏ అభ్యర్థి. ఇలాంటి సమయంలో చంద్రబాబు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎన్డీయేకు మద్దతిస్తే కనుక వైసీపీని టీడీపీ టార్గెట్ చేసేది. ఇప్పుడు వైసీపీ మద్దతిచ్చేది లేదని తేల్చి చెప్పడంతో టీడీపీని ఇరకాడంలో పడేసిందని అంటున్నారు.
బీజేపీ మిత్రపక్షం వ్యూహంలో ఎవరెవరు పడతారు?
సార్వత్రిక ఎన్నికలకు ముందు తమకు బలం లేని రాజ్యసభ విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగానే వ్యవహరించిందని అంటున్నారు. జేడీయు అభ్యర్థిని రంగంలోకి దింపడం ద్వారా తటస్థులను కూడా తమవైపుకు తిప్పుకోవచ్చునని భావించిందని చెబుతున్నారు. అయితే ఎవరెవరు మద్దతిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్గానే ఉంది.