ఇది బాబు జనాల పార్టీ(బీజేపీ).. బ్యాంకు లూటీల భజనా చౌదరి: సుజనా చౌదరిపై విజయసాయి సెటైర్లు
న్యూఢిల్లీ/అమరావతి: బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శల దాడి కొనసాగుతోంది. ఇప్పటికే ఆ ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు సుజనా చౌదరిపై తీవ్ర విమర్శలు చేయగా.. తాజాగా మరో ఎంపీ విజయసాయి రెడ్డి కూడా సుజనాపై తీవ్రంగా మండిపడ్డారు.
'సుజనా చౌదరి బ్యాంక్ దొంగ': ఏకిపారేసిన జగన్ పార్టీ ఎంపీలు, టీడీపీ ఖాళీనే అంటూ..
బాబు జనాల పార్టీ(బీజేపీ)...
ఎంపీ సుజనా చౌదరి పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే భారతీయ జనతా పార్టీ(బీజేపీ) వేరు.. అందులో ఉన్న బాబు(చంద్రబాబు) జనాల పార్టీ(బీజేపీ) వేరు అని అందరికీ మరోసారి బాగా అర్థమైందని ఎంపీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. వైసీపీ ఎంపీలు టచ్లో ఉన్నారంటూ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి తీవ్రంగా మండిపడ్డారు.
బ్యాంకు లూటీల భజనా చౌదరి..
‘అవినీతి మీద చంద్రబాబు నాయుడు, ఆకలి మీద లోకేష్ నాయిడు, ఇసుక అక్రమాల మీద అచ్చెం నాయుడు, మహిళా రక్షణ మీద చింతమనేని, సంస్కారం మీద ఉమా, స్పీకర్ పదవి ఔన్నత్యం మీద యనమల లెక్చర్ ఇస్తే ఎలా ఉంటుందో... బ్యాంకు లూటీల భజనా చౌదరి ఏపి ప్రయోజనాల గురుంచి ప్రెస్ మీట్లు పెడితే కూడా అలాగే ఉంటుంది' అని విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
అలా చేస్తే పార్టీ ఎందుకు మారాడో తెలుస్తుంది..
‘ఈసారి సుజనా చౌదరి వెరైటీ ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది. విలేకర్లను కాకుండా తాను వేల కోట్ల మేర ముంచేసిన అరడజను బ్యాంకుల అధికారుల్ని ఎదుట కూర్చోపెట్టి వారి ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తే... ఆయన పార్టీ ఎందుకు మారాడో, చంద్రబాబు ఎందుకు మార్చాడో అన్నీ అర్ధమవుతాయి' అని విజయసాయి వ్యాఖ్యానించారు.
పబ్లిక్కు తెలిసిపోతుందనా?
‘‘సుజనా వారి మాయా సామ్రాజ్యం' మీద ఒకప్పుడు మొదటి పేజీలో వరస కథనాలతో మోతేక్కించిన ఆంధ్రజ్యోతి ఇప్పుడు... సుజనా చౌదరిని జస్టిస్ చౌదరిగా చూపించేందుకు నిన్న ప్రెస్ మీట్ను లైవ్లో, లైవ్ స్ట్రీమింగ్లో మోతేక్కించిందంటే... కారణం పబ్లిక్ ఇంటెరస్టా? లేక పబ్లిక్గా తెలిసిపోయిన ఇంటెరస్టా?' అంటూ విజయసాయి రెడ్డి చురకలంటించారు.