పప్పుగారూ! పవన్కు జవాబివ్వు, నిప్పు కోసం ఢిల్లీలో చేతులు పట్టుకొని: ఏకిపారేసిన విజయసాయి
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్రత్యేక హోదాతో ఏం వస్తుందని ప్రశ్నించిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా డిమాండుతో 30వసారి న్యూఢిల్లీకి రావడం హాస్యాస్పదంగా ఉందని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి మంగళవారం మండిపడ్డారు. పార్లమెంటు ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు.
Recommended Video
అవినీతి, బంధుప్రీతి, పోలవరం ప్రాజెక్టు, రాజధాని భూములు, ఇసుక దందా, దేవాలాయ భూములు, పట్టిసీమ, సెక్స్ రాకెట్ వంటి పది అంశాల్లో చంద్రబాబుపై కేంద్ర దర్యాఫ్తు సంస్థలతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో చంద్రబాబు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు.
ఆసక్తికరం: పార్లమెంట్ మెట్లకు నమస్కరించి సెంట్రల్ హాల్కు బాబు, కాంగ్రెస్-బీజేపీ మినహా..
చంద్రబాబు యూటర్న్ అంకుల్
ప్రజలంతా చంద్రబాబును యూటర్న్ అంకుల్ అని పిలుస్తుంటారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన 29సార్లు ఢిల్లీకి వచ్చారని, ఇప్పుడు ముప్పయ్యవ సారి వచ్చారన్నారు. తనకు ప్యాకేజీ కావాలని పదేపదే చెప్పిన చంద్రబాబు ఇప్పుడు హఠాత్తుగా యూటర్న్ తీసుకోని ప్రజలకు భయపడి హోదా అని గళమెత్తారన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు హోదా విషయంలో యూటర్న్ తీసుకోరని భావించడం లేదన్నారు. చంద్రబాబు యూటర్న్ అంకుల్ అని, ఆయన ఇక అలా యూటర్న్ తీసుకోవద్దన్నారు.
ఫ్లోర్ లీడర్ల చేతులు పట్టుకొని బతిమాలుతున్నారు
తనకు తెలిసినంత వరకు ఢిల్లీకి యూటర్న్ అంకుల్ చంద్రబాబు వచ్చారని, పప్పు మాత్రం రాలేదని విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు ఢిల్లీకి వస్తే టీడీపీ ఎంపీలు ఇతర పార్టీల నేతల వద్దకు, ఫ్లోర్ లీడర్ల వద్దకు వెళ్లి చేతులు పట్టుకొని తమ అధినేత చంద్రబాబును కలవాలని కోరుతున్నారన్నారు. చంద్రబాబును ఢిల్లీలో ఓ క్రెడిబులిటీ, వ్యక్తిత్వం ఉన్న నేతగా ఎవరూ భావించడం లేదన్నారు.
పప్పు గురించి మాట్లాడను కానీ
గతంలో ప్రత్యేక హోదా కోసం ఇతర పార్టీలు ఉద్యమిస్తే రాళ్లు వేయించారని విజయసాయి రెడ్డి చెప్పారు. కాబట్టి జాతీయ నాయకులు చంద్రబాబును క్రెడిబులిటీ కలిగిన నేతగా భావించడం లేదన్నారు. ఇది నిప్పు క్రెడిబులిటీ అన్నారు. ఇక పప్పు విషయానికి వస్తే... తనను ఆయన విమర్శించినట్లుగా ఈనాడులో వచ్చిందన్నారు. తనను విమర్శించాడు కాబట్టి పప్పు గురించి మాట్లాడుతున్నానని చెప్పారు. లేదంటే ఆయన గురించి మాట్లాడనన్నారు.
పప్పు నాయుడు అంటూ ఏకిపారేసిన విజయసాయి
విజయసాయి రెడ్డి బీజేపీ ఎంపీయా అని పప్పు నాయుడు అడిగారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. తనకు జగన్ బీఫాం ఇస్తే వైసీపీ నుంచి గెలిచానని, తనకు చిత్తశుద్ధి ఉందని చెప్పారు. ఆర్థిక నేరస్తుడికి పీఎంవో ఏం పని అని లోకేష్ ప్రశ్నిస్తున్నారని, కానీ రేపో మాపో జైలుకు వెళ్లే వ్యక్తి పప్పు నాయుడు తండ్రి అని మండిపడ్డారు. సంస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదన్నారు. తాను ఎప్పటికీ వైయస్ మనిషినే అన్నారు.
పప్పు నాయుడు గారు మీరెందుకు అలా?
పప్పు నాయుడు గారు సోమవారం అమరావతికి వెళ్తారని, శుక్రవారం మళ్లీ హైదరాబాదుకు వెళ్తారని, అక్కడ ఆయనకు ఏం పని అని విజయసాయి ప్రశ్నించారు. రాజధాని అమరావతిలో ఉంటే పప్పు నాయుడుకు హైదరాబాదులో ఏం పని అన్నారు. అలాంటి వ్యక్తి తాను ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఎప్పటికీ తిరుగుతానని చెబుతున్నారన్నారు.
బీజేపీతో లోపాయికారి ఒప్పందంపై
బీజేపీ నాయకులతో తనకు లోపాయికారి ఒప్పందం ఉందా అని పప్పు నాయుడు ప్రశ్నించారని, కానీ నిప్పుగారికి, పప్పుగారికి మాత్రమే ఆ లోపాయికారి ఒప్పందం ఉంటుందని, వైసీపీకి, తనకు ఉండదని పప్పునాయుడు గుర్తించాలని విజయసాయి అన్నారు. మీకు సిగ్గు, ఎగ్గు ఉంటే, మీ దేహంలో చీము నెత్తురు ఉంటే ఈ నాలుగేళ్లు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం అనుభవించి ఇప్పుడు యూటర్న్ తీసుకుంటారా అని దుయ్యబట్టారు. నిజంగా టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే వైసీపీలా మీరు ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లేవారన్నారు.
పవన్ కళ్యాణ్ విమర్శలకు సమాధానం చెప్పు
మరో ఆఖరి విషయం కూడా చెప్పదల్చుకున్నానని, ముఖ్యమంత్రి గారు తన సుపుత్రుడు పప్పు నాయుడుకు మూడు పోర్టు ఫోలియోలు ఇచ్చారని, అవి అక్రమం, అవినీతి, అన్యాయం అనే పోర్ట్ ఫోలియోలు అన్నారు. లోకేష్ పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారని, గతంలో ఎవరూ చేయలేని అవినీతి లోకేష్ చేశారని చెప్పారని వాటికి మీరు సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు హయాంలో ఎన్నో అక్రమాలు, అవినీతి చోటు చేసుకుందన్నారు. చంద్రబాబుకు, లోకేష్కు చిత్తశుద్ధి ఉంటే ఏపీలో జరిగిన 10 అంశాలపై సీబీఐ విచారణ ఎదుర్కొని బయటకు రావాలన్నారు.