'బాబూ! తెలంగాణలో కాకుండా 3రాష్ట్రాల్లో కాంగ్రెస్ను ఎలా గెలిపించావ్, ఎల్లో కులమీడియా ఎదురుచూపు'
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి మరోసారి ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. ఆయన ట్విట్టర్లోను సోమవారం నిప్పులు చెరిగారు. అలాగే పెథాయ్ తుఫాను కారణంగా ఏపీలో కోస్తా ప్రజలు అరచేతిలో ప్రాణాలు పట్టుకొని బిక్కుబిక్కుమంటున్న సమయంలో వారికి అండగా నిలవలేదని విమర్శించారు.
ప్రజలకు అండగా ఉండి భరోసా ఇవ్వాల్సిన సమయంలో చంద్రబాబు ఇవేమీ పట్టించుకోకుండా, ఏపీలో పాలనను గాలికి వదిలేసి ప్రత్యేక విమానంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ వెళ్లి కాంగ్రెస్ పార్టీ కొత్త రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాల్లో బిజీగా ఉన్నారని ధ్వజమెత్తారు. రియల్ టైమ్ గవర్నెన్స్ అంటే ఇదే కాబోలు అన్నారు.
మూడు రాష్ట్రాల్లో చంద్రబాబు ఎలా గెలిపించారు?
'మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపు మీ వల్లేనని సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. అక్కడ మీరు ప్రచారం చేయలేదు. తెలుగు వాళ్లు లేరు. ఆ గెలుపుకు మీకు ఏమి సంబంధం లయ్యర్ చంద్రబాబు. మీరు పంపిన డబ్బును పంచి కాంగ్రెస్ గెలిచిందా? లేక టెలీపతీ ద్వారా అక్కడి ఓటర్లను ప్రభావితం చేసారా?' అని విజయసాయి రెడ్డి చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఇటీవల చంద్రబాబు మాట్లాడుతూ.. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవడం వెనుక టీడీపీ పాత్ర ఉందని చెప్పారు.
మీ యెల్లో కులమీడియా ఎదురు చూస్తోంది
చంద్రబాబు కారణంగా అమరావతికి రైలు లైన్ కల చెదిరిపోయిందని, యెర్రుపాలెం నుంచి అమరావతికి వేయాల్సిన డబుల్ లైన్ సింగిల్ లైన్గా మారిందని విజయసాయి విమర్శించారు. హవాలా ఏజెంట్ కీర్తి కుమార్ జైన్తో మీకు లింక్ గుర్తుకు వస్తుందా చంద్రబాబు అంటూ మరో ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులకు ఖమ్మంలో మీ బినామీ నామాకు ఎన్నికల కోసం హవాలాలో మీరు పంపిన రూ.5.8 కోట్లు పోలీసులు పట్టుకున్నారని పేర్కొన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర చేస్తోందని సెలవివ్వాలని, అచ్చు వేయడానికి మీ యెల్లో కుల మీడియా ఎదురు చూస్తోందని పేర్కొన్నారు. మడకశిర ఎమ్మెల్యే అంశంలోను చంద్రబాబుపై విజయసాయి విమర్శలు గుప్పించారు.
మీరు కాలు పెట్టారో లేదో తెలంగాణలో ఓడింది
మీరు కాలు పెట్టారో లేదో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గల్లంతయిందని, గెలుపు అయితే నాదని, ఓటమి అయితే మీదన్నట్లుగా చంద్రబాబు తప్పించుకుంటున్నారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. ఏం చెప్పినా కుల మీడియా ద్వారా నమ్మించవచ్చునని భావిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ఓటమి గురించి మాట్లాడకుండా, మనకు సంబంధం లేని ఉత్తరాది రాష్ట్రాల్లోని కాంగ్రెస్ విజయాన్ని చంద్రబాబు ఖాతాలో వేసుకున్నారని, ఈ కామెడీ చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబుపై కార్టూన్
విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ అకౌంట్లో ఓ కార్టూన్ను పోస్ట్ చేశారు. అమరావతిని గ్రాఫిక్స్లలో చూపిస్తున్నారని, కానీ అమరావతిలో ఇంత వరకు కట్టిందేమీ లేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ సాయి రెడ్డి ఓ కార్టూన్ పోస్ట్ చేశారు. అమరావతి ఎక్కడ అని ఓ జంట అడిగితే.. గ్రాఫిక్స్ రూంకు తీసుకెళ్తున్నట్లుగా ఉన్న కార్టూన్ను ట్వీట్ చేశారు.