ఓటుకు నోటు కేసుతో దగ్గరపడింది, ఫిబ్రవరిలోనే 'చంద్ర' గ్రహణం: విజయసాయి సంచలనం
అమరావతి: ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కలవడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి శుక్రవారం స్పందించారు. ఈ మేరకు ఆయన తన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
ఇటలీ దెయ్యంని తరిమికొట్టాలని చెప్పావుగా: బాబుపై అంబటి, టీడీపీకి డిపాజిట్లు రావని సర్వేలు..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, ఆ పార్టీ వెంటి లెటర్ పై ఉందని, అది తీసేస్తే చనిపోయినట్లేనని, ఆ పార్టీని భూస్థాపితం చేసే వరకు విశ్రమించేది లేదని ఏడాది క్రితం చెప్పిన చంద్రబాబు ఇప్పుడు భారీ డైలాగ్స్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్కు పొర్లు దండాలు పెడుతున్నారన్నారు.
దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా
'కోట్లు పెట్టి ఎమ్మెల్యేల కొనుగోళ్ళు, ఓటుకు కోట్లతో ఆఫర్లు, జన్మభూమి మాఫియా, అవినీతి, అక్రమాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, రాజ్యాంగాన్ని పరిహసించిన ఈ పచ్చి మోసకారి చంద్రబాబు నోట ఇప్పుడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణ. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా!' విజయసాయి ట్వీట్ చేశారు.
ఓటుకు నోటు కేసుతో ఎవరూ తప్పించుకోలేరని రుజువయ్యే రోజులు
'అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఎలా ఆపలేరో, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ బాబు ఎల్లకాలం తప్పించుకు తిరగలేరని ఓటుకు నోటు కేసుతో రుజువయ్యే రోజులు దగ్గర పడ్డాయి. అధికారం కోసం పరాన్నజీవిలా ఇతరులపై ఆధారపడే బాబుకు వచ్చే ఫిబ్రవరి నుంచే సంపూర్ణ ‘చంద్ర' గ్రహణం మొదలుకాబోతోంది.' మరో ట్వీట్లో సాయి రెడ్డి పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసు రుజువయ్యే రోజులు దగ్గర పడ్డాయని, ఫిబ్రవరి నుంచి చంద్రగ్రహణం మొదలు కాబోతుందని విజయసాయి తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.
నాడు రాహుల్ గాంధీకి వార్నింగ్ ఇచ్చాడు
'ఏడాది క్రితం గుంటూరులో సభ పెడితే రాహుల్కు బాబు వార్నింగ్ ఇచ్చాడు. తెలుగు జాతికి క్షమాపణలు చెప్పిన తర్వాతే సభ జరగాలన్నారు. పచ్చ చొక్కాల చేత నల్ల జెండాలతో నిరసన చేయించారు. రాహుల్ కారుపై కోడి గుడ్లు విసిరారు. ఇప్పుడు, అదే రాహుల్కు బాబు శాలువా కప్పి కాళ్ళు పట్టుకున్నాడు!' విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
కాంగ్రెస్పై నాడు ఇలా, నేడు ఇలా
'కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు.ఆ పార్టీ వెంటిలేటర్పై ఉంది.అది తీసేస్తే చచ్చినట్లే.ఆ పార్టీని భూస్థాపితం చేసే వరకు విశ్రమించేది లేదు'...ఏడాది క్రితం వరకు ప్రతి వేదికపైన బాబు చెప్పిన భారీ డైలాగులు.ఇప్పుడు...శరణు కోరుతూ కాంగ్రెస్కు పొర్లు దండాలు.అహా!ఏం వీరత్వం,శూరత్వం?' అన పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ కాళ్లు పట్టుకున్నారు
'పొలిటికల్ దళారి చంద్రబాబు కొత్త అవతారం ఎత్తాడు. మొన్నటి వరకు సోనియాను రాక్షసి అని, బొంద పెట్టాలని, తరిమి కొట్టాలని పెడబొబ్బలు పెట్టాడు. ఇప్పుడు రాహుల్ కాళ్లు పట్టుకుని ప్రజాస్వామ్యం కాపాడుతాం అంటున్నాడు. సిగ్గు శరం ఉందా ఈ మనిషికి?' అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో గతంలో చంద్రబాబు కాంగ్రెస్ పైన, సోనియా గాంధీ పైన.. ఏం మాట్లాడారో.. అందుకు సంబంధించిన పేపర్ కటింగ్స్ అటాచ్ చేశారు.