ఏం తాకట్టు పెట్టడానికి వస్తున్నారు: చిరుపై విజయమ్మ
ఈ సందర్భంగా కేంద్రమంత్రి చిరంజీవిపై తీవ్ర స్థాయిలో విజయమ్మ మండిపడ్డారు. 70 లక్షల మంది ఓటర్లను మోసం చేసిన చిరంజీవి, వారు గెలిపించిన 15 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ ఏం తాకట్టు పెట్టడానికి చిరంజీవి ప్రజల ముందుకు వస్తున్నారని ఆమె ప్రశ్నించారు.
జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన సమయంలో కేంద్రానికి రూట్ మ్యాప్ ఇచ్చారని విజయమ్మ ఆరోపించారు. నేత కార్మికుల ఆత్మహత్యలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే కారణమని, జనతా వస్త్రాలను రద్దు చేసి ఆప్కోలను నిర్వీర్యం చేశారని విమర్శించారు.
హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు తానే కారణమని చెప్పుకుంటున్నారని..నమ్మేవారుంటే హుస్సేన్ సాగర్, చార్మినార్లను కూడా తానే కట్టించానని చెబుతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో తాగడానికి నీరు, తినడానికి తిండి లేక ప్రజలు వలసలు పోయారని విజయమ్మ ఆరోపించారు. ప్రజలు ఆకలికేకలతో అలమటిస్తుంటే సింగపూర్, మలేషియా దేశాలు తిరిగొచ్చారని విమర్శించారు.