గుర్రాలతో తొక్కించారు: బాబుపై విజయమ్మ, చిరుపైనా
కాకినాడ: ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై మంగళవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాళ్లరేవులో ఆమె రోడ్ షో నిర్వహించారు. రాష్ట్రానికి పట్టిన పీడకల చంద్రబాబు పాల అని ఆమె వ్యాఖ్యానించారు.
వేతనాలు పెంచాలని కోరుతూ ఆందోళన చేపట్టినవారిని గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు చరిత్రను అక్కాచెల్లేళ్లు మరిచిపోరని విజయమ్మ అన్నారు. రైతులను కాల్పించి పోలీసులను అభినందించిన చరిత్ర చంద్రబాబుదని ఆమె అన్నారు.
అభిమానులను తాకట్టు పెట్టిన చరిత్ర కేంద్ర మంత్రి, కాంగ్రెసు నాయకుడు చిరంజీవిదని ఆమె దుయ్యబట్టారు. చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, చిరంజీవి మాటలను ప్రజలు ఇప్పుడు నమ్మేస్థితిలో లేరని ఆమె అన్నారు.
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని, ఆ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగే సామర్థ్యం తన కుమారుడు వైయస్ జగన్కు మాత్రమే ఉందని ఆమె చెప్పారు. తమ పార్టీ విజయంతో చరిత్ర సృష్టిద్దామని, మన అభివృద్ధి మనమే చేసుకుందామని ఆమె అన్నారు. ఓటేసే ముందు ఒక్కసారి వైయస్ రాజశేఖర రెడ్డిని గుర్తు చేసుకోవాలని ఆమె అన్నారు.