రాజన్న రాజ్యం జగన్ తోనే సాధ్యం:విజయమ్మ; ఇడుపులపాయలో వైఎస్సార్కు ఘనంగా నివాళి
Recommended Video
కడప: రాజన్న రాజ్యం జగన్తోనే సాధ్యమని వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ 9వ వర్ధంతిని పురస్కరించుకొని ఆమె ఆదివారం కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..."దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దేవుని దగ్గరున్నారు...ప్రజల కోసం చేయాల్సిన పనులన్నీ చేసి ఆయన దేవుడి దగ్గరకు వెళ్లిపోయారు. అందుకే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కారణజన్ముడిగా మిగిలిపోయారు. అలాంటి పాలనను, పథకాలు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే కొనసాగించగలరు. జగన్ ద్వారా వైఎస్సార్ పాలనను మళ్లీ తీసుకొద్దాం'' అని పిలుపునిచ్చారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద కుటుంబ సభ్యులు, అభిమానులు, వైసిపి నేతలతో కలసి వైఎస్సార్ సతీమణి, వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి ఘనంగా నివాళులర్పించారు...ఈ సందర్భంగా ఫాదర్ నరేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ...''వైఎస్ ఆశయాలను నెరవేర్చేందుకు జగన్ పాదయాత్ర చేస్తూ మీ బిడ్డగా వస్తున్నారు. ఆశీర్వదించండి. జగన్ సీఎం అవుతాడు. రాజశేఖర్రెడ్డి ఆశయాలను, ఆయన మిగిల్చిపోయిన మంచి పనులను నెరవేరుస్తాడు''... అని చెప్పారు.
"ఈరోజు జగన్ ప్రజా సంకల్పయాత్ర ద్వారా ప్రజల మధ్య తిరుగుతున్నాడు...వైఎస్సార్ ఆశయాలను, సిద్ధాంతాలను జగన్ నిలబెడతాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను...ప్రజలందరికీ జగన్ ఎల్లవేళలా తోడుంటాడు...మీ అందరికీ ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక మనవడిగా నా బిడ్డ నిలబడతాడు...రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకుందాం. అందుకోసం ప్రతి ఒక్కరూ జగన్కు అండగా నిలబడాలి''...అని వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు
వైఎస్సార్ నివాళి కార్యక్రమంలో విజయమ్మతో పాటు కోడలు భారతిరెడ్డి, కుమార్తె షర్మిల, వైఎస్ జగన్ కుమార్తె హర్ష, షర్మిల కుమార్తె అంజలి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్ సుధీకర్రెడ్డి, వైఎస్సార్ సోదరి విమలమ్మ తదితరులు పాల్గొని వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. వైఎస్సార్ సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
విశాఖ జిల్లాలో పాదయాత్రలో ఉన్న వైసీపీ అధినేత జగన్ అన్నవరం శివారులో ఏర్పాటు చేసిన శిబిరంలో వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగన్ ట్వీట్ చేస్తూ, ''వర్ధంతి రోజున నాన్నను గుర్తు చేసుకున్నాను. నాన్న ఆశయాల వెలుగులే నాకు దారి చూపుతాయి. ఆయన ఆశయాలను నెరవేర్చటమే నా జీవిత లక్ష్యం'' అని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలోనూ వైఎస్సార్ వర్ధంతి సభలను నిర్వహించారు. ఇంకోవైపు విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో పలువురు కాంగ్రెస్ నేతలు దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ కు నివాళి అర్పించారు.