తెలంగాణలో సిఎంనూ అరెస్ట్ చేస్తారా: విజయమ్మ
నేలకొండపల్లి/హైదరాబాద్: తెలంగాణలో పర్యటిస్తే.. సమైక్యవాదాన్ని వినిపిస్తున్న ముఖ్యమంత్రిని కిరణ్కుమార్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారా అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో రైతులను పరామర్శించేందుకు వచ్చిన విజయమ్మను తెలంగాణవాదులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో విజయమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో విజయమ్మ పైవిధంగా స్పందించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. పోలీసులు తనను పర్యటించకుండా అడ్డుకోవడంపై విజయమ్మ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలందరూ కలసి ఉండాలని తమ పార్టీ కోరుకుంటుందోని ఆమె తెలిపారు. కొంతమంది నాయకులు, పార్టీలు వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాస్తున్నారని విజయమ్మ ఆరోపించారు.
తెలంగాణ ప్రజలు దివంగత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూస్తున్నారని ఆమె అన్నారు. భారీ వర్షాల కారణంగా రైతులు ఇబ్బందుల్లో ఉంటే.. ముఖ్యమంత్రి, మంత్రులు వారిని పరామర్శించేందుకు ఎందుకు రాలేదని ఆమె ప్రశ్నించారు. రైతులను పరామర్శించడం కూడా తప్పేనా అని ఆమె అన్నారు. తెలంగాణ అంటే పాకిస్థాన్, బంగ్లాదేశా అని ప్రశ్నించారు.
రైతులను పరామర్శించేందుకు వచ్చిన తనను అడ్డుకునే వారిని అరెస్ట్ చేయకుండా తనను అదుపులోకి తీసుకోవడం మేంటని ఆమె అన్నారు. అసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా అనే సందేహం కలుగుతోందని ఆమె అన్నారు. త్వరలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుందనీ, అప్పుడు మళ్లీ వస్తానని తెలిపారు.
అరెస్టుకు ముఖ్యమంత్రిదే బాధ్యత: శోభానాగిరెడ్డి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అరెస్టుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యత వహించాలని ఆ పార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అన్నారు. ఆయన ఆధీనంలోనే హోంశాఖ ఉందని గుర్తు చేశారు. విజయమ్మ పర్యటనను అడ్డుకునే హక్కు మీకు ఎవరిచ్చరని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అరెస్ట్ నేపథ్యంలో శోభానాగిరెడ్డితోపాటు పలువురు పార్టీ నేతలు డిజిపి ప్రసాదరావును కలిశారు.