కేంద్రమంత్రి ఆశోక్ కు గంటా షాక్: అధ్యక్షపదవి రేసులో ముగ్గురిపేర్లే, రేసులో లేని జగదీష్
విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీలో కేంద్రమంత్రి ఆశోక్ గజపతిరాజు ప్రాబల్యం తగ్గిపోతున్నట్టు కన్పిస్తోంది. ఆశోక్ సూచించిన పేరు పార్టీ జిల్లా అధ్యక్ష పదవి అభిప్రాయసేకరణలో కన్పించలేదు.
విజయనగరం: విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీలో కేంద్రమంత్రి ఆశోక్ గజపతిరాజు ప్రాబల్యం తగ్గిపోతున్నట్టు కన్పిస్తోంది. ఆశోక్ సూచించిన పేరు పార్టీ జిల్లా అధ్యక్ష పదవి అభిప్రాయసేకరణలో కన్పించలేదు. పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎంపికలో కేంద్రమంత్రి ఆశోక్ గజపతి పై చేయి సాధిస్తారా, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు పై చేయి సాధిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
విజయనగరం జిల్లాలో పార్టిని నడిపించడంలో కేంద్రమంత్రి ఆశోక్ గజపతిరాజుకు చంద్రబాబునాయుడు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇప్పటివరకు జిల్లాలో పార్టీ నాయకులు కూడ ఆయన బాటలోనే నడిచారు. అయితే పార్టీ అవసరాల రీత్యా ఆశోక్ కు ప్రత్యర్థివర్గంగా ఉన్న సుజయకృష్ణరంగారావును టిడిపిలో చేర్చుకొన్నారు. అంతేకాదు ఆయనకు మంత్రిపదవిని కూడ కట్టబెట్టారు.
అయితే సుజయకృష్ణరంగారావు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సమీక్షసమావేశం నిర్వహిస్తే కొందరు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి గైరాజరై అమరావతికి చేరుకొన్నారు.అయితే ఈ విషయమై బాబు ఎమ్మెల్యేల తీరుపై మండిపడ్డారు.
మరోవైపు జిల్లా పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో కేంద్రమంత్రి ఆశోక్ గజపతిరాజు సూచించిన వ్యక్తికి పదవిని కట్టబెట్టే అవకాశాలు తక్కువగా ఉన్నాయని రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు. అయితే అధ్యక్షపదవికి పోటీపడుతున్నవారి జాబితాలో కేంద్రమంత్రి ఆశోక్ గజపతిరాజు సూచించిన జగదీష్ పేరు లేకపోవడం కలకలం రేపుతోంది.
ముగ్గురిపైనే అభిప్రాయసేకరణ
విజయనగరం జిల్లా టిడిపి అధ్యక్ష పదవి కోసం పార్టీ నాయకత్వం కోసం అభిప్రాయసేకరణలో ముగ్గురు పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ. నాయుడు, ఆయన సోదరుడు కొండబాబు, పూసపాటిరేగ ఎంపీపీ మహంతి చిన్నంనాయుడు పేర్లు మాత్రమే విన్పిస్తున్నాయి.అయితే కేంద్రమంత్రి ఆశోక్ గజపతిరాజు సూచించిన జగదీష్ పేరు మాత్రం విన్పించడం లేదని పార్టీవర్గాలు చెబుతున్నాయి.ఈ ముగ్గురిలో ఎవరైతే జిల్లా పార్టీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారనే ఐవీఆర్ఎస్ నుండి పార్టీ క్యాడర్ నుండి సమాధానాలు కోరుతున్నారు.
కేంద్రమంత్రి ఆశోక్ గజపతిరాజు ప్రాబల్యానికి చెక్
టిడిపి జిల్లా పార్టీ అధ్యక్షుడి ఎంపిక విషయమే కాకుండా ఇటీవల జిల్లాకు చెందిన శత్రుచర్ల విజయరామరాజు, సుజయకృష్ణరంగారావుల చేరిక విషయంలో కూడ ఆశోక్ సూచనలను పార్టీ పట్టిపట్టనట్టు వ్యవహరించిందనే అభిప్రాయాలను రాజకీయవిశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లాకు గంటా శ్రీనివాస్ రావు ఇంచార్జ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ పరిస్థితి మరింత ఎక్కువైందనే వాదన పార్టీశ్రేణుల్లో వ్యక్తమౌతోంది.కానీ, మహనాడుకు జిల్లా కార్యవర్గం ఎన్నిక కాకుండానే వెళ్ళాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
అధ్యక్షపదవి రేసులో కొండబాబు
విజయనగరం జిల్లా టిడిపి అధ్యక్షుడి ఎంపిక విషయంలో గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు కొండబాబు సోదరుడు కొండబాబు పేరు ప్రధానంగా విన్పిస్తోంది. కొండబాబు ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబునాయుడును కలిశారు. పార్టీ పదవిని ఇచ్చే విషయమై బాబునుండి ఆయనకు సానుకూలమైన హమీ లభించిందని పార్టీ వర్గాల్లో చర్చసాగుతోంది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలోనే అభిప్రాయసేకరణలో ఆయన పేరును పరిశీలనకు తీసుకొన్నారని చర్చ సాగుతోంది.
శోభహైమావతికి ప్రధాన కార్యదర్శి పదవి లేనట్టేనా?
విజయనగరం జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి పదవిని ఆశిస్తున్న తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభ హైమావతికి ఆ పదవి దక్కకపోవచ్చు. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఐవిపి రాజునే ప్రధాన కార్యదర్శి పదవికి ఎంపికచేసినట్టు సమాచారం.అయితే ఈ పదవిపై ఆశలు పెట్టుకొన్న శోభహైమావతి, భాస్కర్ రావు, మీసాల గీత, జగదీష్ పేర్లు కూడ ఈ పదవికి పరిశీలనలో లేవు.