ఇదంతా బాబు కుట్ర .. ఫిరాయింపులైనా ... వరదముంపు అయినా కుట్ర స్టోరీలే అంటున్న విజయసాయి
వైసిపి నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. ఏ విషయం అయినా చంద్రబాబు కుట్రను సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేసే విజయసాయి ఈసారి వరదల విషయంలోనూ, ఫిరాయింపుల విషయంలోనూ చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో టిడిపి ఫినిష్ అయిందని చెప్పిన విజయసాయి ఏపీలో టీడీపీ నుండి ఫిరాయింపుల పర్వం కొనసాగుతుందని పేర్కొన్నారు. అంతేకాదు పార్టీ మారిన నేతలెవరూ చంద్రబాబు గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళుతున్నారని ఇదంతా బాబు కనుసన్నుల్లోనే జరుగుతుందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
అక్రమ కొంప మునగటానికి వీల్లేదనే చంద్రబాబు కుట్ర స్టోరీలు
ఇక కృష్ణా నది వరదల విషయంలో రాష్ట్ర ప్రజలు ముంపునకు గురైన పర్వాలేదు కానీ చంద్రబాబు ఇల్లు మాత్రం ముంపునకు గురి కాకూడదు అంటూ అక్రమ కొంప మునగ డానికి వీల్లేదని కుట్ర స్టోరీలు తెరమీదకు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు విజయసాయి.ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై నిప్పులు చెరిగిన విజయసాయి నాపై కక్ష తో వరదలు తెప్పించారని చంద్రబాబు చేసిన ఆరోపణలను తప్పుపట్టారు. ఇక సైరా పంచ్ లతో చంద్రబాబుకు చురకలంటించారు. ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని అంచనా వేసి కిందకి ఎంత అనేది ఇరిగేషన్ ఇంజనీర్లు నిర్వహిస్తారని, డ్యాము బ్యారేజీ ల భద్రత వారికి ముఖ్యమని విజయసాయి పేర్కొన్నారు.
అమరావతి ముంపుపై జనాలు ప్రశ్నించకుండా చంద్రబాబు ఇంటిపై దృష్టి మళ్ళించే యత్నం అన్న విజయసాయి
కానీ చంద్రబాబు తన అక్రమ కొంప మునగ డానికి వీల్లేదని కుట్ర స్టోరీలు తెరమీదికి తెస్తున్నారని మండిపడిన విజయ సాయి బ్యారేజి దిగువన ఉన్న ప్రజలు బలైపోయిన పర్వాలేదట అంటూ ట్వీట్ చేశారు . అలాగే అమరావతి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించింది .అంతగా సురక్షితం కాని పల్లపు ప్రాంతాన్ని రాజధానిగా ఎందుకు ఎంపిక చేశారని రేపు కేంద్ర ఆరా తీస్తుంది. దీనిపైన ప్రజలు కూడా ప్రశ్నిస్తారు జవాబు చెప్పలేక బాబుగారి నివాసాన్ని వరదలో ముంచారని దుష్ప్రచారం మొదలుపెట్టారు తీసేసిన తహసీల్దార్లు అంటూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
పార్టీ ఫిరాయింపులు బాబు కుట్రే .. పార్టీ మారేవారు బాబును విమర్శించటం లేదని వ్యాఖ్య
ఇక అంతటితో ఆగక తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఖాళీ అయింది. బాబే కొందరిని కాంగ్రెస్ పార్టీలోకి మిగిలిన వారిని బీజేపీలోకి పంపించారు. ఇక ఇప్పుడు ఏపీలో కూడా ఫిరాయింపుల పర్వం కొనసాగుతోంది పార్టీ మారే వారు బాబుపై ఒక విమర్శలు చేయడం లేదు ఇదంతా ఆయన కనుసన్నల్లోనే జరిగినట్టు తెలిసిపోవడం లేదూ అంటూ మరో ట్వీట్ చేసిన విజయసాయి టీడీపీ నుండి పార్టీ ఫిరాయింపులు కూడా చంద్రబాబు కుట్ర అని తన ట్వీట్ లో పేర్కొన్నారు. మొత్తానికి చంద్రబాబు ఏం చేసినా అందులో ఏదో కుట్ర దాగి ఉంది అంటూ విమర్శలు గుప్పించే విజయసాయి ఇప్పుడు తాజా పరిణామాలపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.