బాబు మనుగడ కోసం ఎవరి కాళ్లయినా పట్టుకుంటారట.. ఆయన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లా వార్నింగ్ ఇస్తారట
వైసిపి నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. ఏ విషయం అయినా చంద్రబాబు కుట్రను సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేసే విజయసాయి ఈ సారి చంద్రబాబు ఫిలాసఫీ గురించి, మధ్య నిషేధం ఎత్తేసి బాబు నడిపిన లిక్క లాబీయింగ్ గురించి , ఇక పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చంద్రబాబు ఒకేలా ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో టిడిపి ఫినిష్ అయిందని చెప్పిన విజయసాయి ఏపీలో టీడీపీ మనుగడ కోసం బీజేపీతో దోస్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారని , ఆ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.
చంద్రబాబు వార్నింగ్ లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వార్నింగ్ లు ఒకేలా ఉన్నాయన్న విజయసాయి
ఇక తాజాగా టీడీపీ కార్యకర్తలపై , నేతలపై దాడులు జరుగుతున్నాయని చూస్తూ వూరుకోనని చెప్పిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ లు ఇస్తున్నారు. ఇక ఈ వార్నింగ్ లకు రివర్స్ కౌంటర్ గా ఆయనను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో పోల్చారు విజయ సాయి. "పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్కు చేస్తున్న హెచ్చరికలు, ప్రజలు ఈడ్చి కొడితే ఎక్కడో పడిన చంద్రబాబు వార్నింగులు ఒకేలా ఉంటున్నాయి. మూడు నెలల్లోనే ఏపీ సీఎం జగన్ అన్నింటిలో విఫలమయ్యారంట. అర్జంటుగా కుర్చీ ఖాళీ చేయాలని గగ్గోలు పెడుతున్నాడు అంటూ ఇమ్రాన్ ఖాన్ తో పోలుస్తూ ఘాటుగా విమర్శలు గుప్పించారు.
బీజేపీతో పొట్టు కోసం సిగ్గులేకుండా వెంపర్లాడుతుంది పచ్చ పార్టీ అన్న విజయసాయి
ఊసరవెల్లి సిద్ధాంతాలతో నడిచే తెలుగు దేశం పార్టీ అంటూ టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక టీడీపీ దేశంలో జతకట్టని పార్టీ లేదు. ఫ్రంటూ లేదు. ప్రధాని నరేంద్రమోడీ మళ్ళీ ప్రధాని కానేకాడని జోస్యాలు చెప్పిన సిగ్గు లేని పచ్చ పార్టీ ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతోంది అంటూ చాలా ఘాటుగా విమర్శించాడు. మనుగడ కోసం ఎవరి కాళ్లు పట్టుకున్నా తప్పులేదనేదే చంద్రబాబు గారి ఫిలాసఫీ అంటూ రెచ్చిపోయారు విజయ సాయి .
మద్య నిషేధం లిక్కర్ లాబీ కోసం ఎత్తేసిన చంద్రబాబును ప్రజలు ఎప్పటికీ మర్చిపోరన్న వైసీపీ ఎంపీ
ఇక ఏపీలో చంద్రబాబు హయాంలో మద్య నిషేధం ఎత్తివేశారని , ఇప్పుడు సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన మాట కోసం మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పారు. ఏపీ సీఎం వై ఎస్ జగన్ దుకాణాల సంఖ్యను తగ్గిస్తూ, బెల్టు షాపులను తొలగిస్తుంటే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి నోరు పెగలడం లేదు అంటూ విమర్శలు గుప్పించారు. అప్పట్లో సంపూర్ణ మద్యనిషేధాన్ని లిక్కర్ లాబీ కోసం చంద్రబాబు గారు ఎత్తేసిన విషయాన్ని ఎల్లో మీడియా దాచి పెట్టినా ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు అంటూ చంద్రబాబుపై విరుచుకు పడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి .
దేశ జీడీపీ 5% పడిపోవడానికి కొత్త ప్రభుత్వమే కారణమని చంద్రబాబు చెంచాల ఆరోపణ అంటూ ఫైర్
ఇక అంతే కాదు దేశ జీడీపీ 5% పడిపోవడానికి ఏపీలో 3 నెలల క్రితం ఏర్పడ్డ కొత్త ప్రభుత్వమే కారణమని చంద్రబాబు చెంచాల ఆరోపణ. పదేళ్ల తర్వాత జలాశయాలన్నీ నిండి రెండు పంటలకు నీరు అందుబాటులోకి వస్తే పచ్చ మేధావులకు కళ్లకు కనిపించట్లేదు. ప్రధాని నరేంద్ర మోడీ ని అనే ధైర్యం లేకనే ఈ పిచ్చి మాటలు అంటూ ఏ చిన్న అంశం అయినా వదలకుండా కౌంటర్ అటాక్ ఇస్తున్నారు విజయ సాయి. చంద్రబాబు అంటేనే ఒంటి కాలి మీద లేచే విజయ సాయి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తూ ప్రతిపక్ష పార్టీ చేస్తున్న మాటల దాడికి ఎదురు దాడి కొనసాగిస్తున్నారు.