చంద్రబాబు ఇంట్లో ఉంటే వారికేం తోచడం లేదా ? రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనుక?
రాజకీయాల్లో ప్రత్యర్ధులు ఉన్నంతసేపూ వారిని ఆడిపోసుకుంటారు కానీ ఒక్కసారి వారు లేకుండా పోతే కనిపించే లోటే వేరు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో సై అంటే సై అనేలా తలపడిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం తర్వాత చంద్రబాబుకు సమవుజ్జీలు లేకుండా పోయారన్న వాదన బలంగా వినిపించింది. ఇంకా చెప్పాలంటే చంద్రబాబుకు రాజకీయంగా ప్రత్యర్ధులే కరువయ్యారు. 2009 నుంచి 2014 వరకూ దాదాపు ఐదేళ్లపాటు చంద్రబాబు పరిస్ధితి. కానీ ఇప్పుడు చంద్రబాబు కరోనా వైరస్ కారణంగా హైదరాబాద్ లోని ఇంట్లోనే పరిమితం కావడంతో ఏపీలోని ఆయన ప్రత్యర్ధులకు ఏమీ తోచడం లేదు.
ఆ పాపం తండ్రీకొడుకులదే: విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై చంద్రబాబు సవాల్
చంద్రబాబు అజ్ఞాతవాసం కలవరపెడుతోందా ?
కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించి ఎంత కాలమైందో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సొంత ఇంటికి వెళ్లి కూడా అంతే కాలమైంది. దాదాపు రెండునెలలుగా చంద్రబాబు ఇంట్లోనే ఉంటూ హైటెక్ పరికరాలతో, గ్యాడ్డెట్స్ తో టైంపాస్ చేసేస్తున్నారు. తనకు బోర్ కొట్టినా అవే, పార్టీ నేతలతో మాట్లాడాలన్నా అవే, ఇంట్లో మనవడు దేవాన్ష్ తో ఆడుకోవాలన్నా అవే. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇంత ఖాళీ దొరక్కపోవడంతో చంద్రబాబుకు కూడా బోర్ కొట్టేస్తున్నట్లు కనిపిస్తోంది. అయినా తప్పదు.
బయటకు రప్పించేందుకు వైసీపీ పాట్లు...
కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించిన కొత్తలో చంద్రబాబు గురించి అంతగా పట్టించుకోకుండా తాము మాత్రం ఎంచక్కా జనంలో తిరిగేసిన వైసీపీ నేతలు.. ఆ తర్వాత ఆయన ఎక్కడంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. టీడీపీ నుంచి ఎలాంటి సమాధానం రాకపోయే సరికి ఎంపీ విజయసాయిరెడ్డి వంటి వారు మరింత ముందుకెళ్లి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై విమర్శలు ప్రారంభించారు. చివరికి ఇవి ఏ స్ధాయికి వెళ్లాయంటే లాక్ డౌన్ లో నాయుళ్లిద్దరూ తప్పిపోయారు, వారిద్దరినీ వ్యాన్ ఎక్కించి అయినా సరే మా రాష్ట్రానికి పంపేయండి అంటూ కేసీఆర్ ను కోరుతూ సాయిరెడ్డి ట్వీట్ పెట్టే దాకా వెళ్లింది. ఇప్పటికే అదే తంతు. రోజూ సాయిరెడ్డి చంద్రబాబును ఉద్దేశించి పెడుతున్న ట్వీట్లను గమనిస్తే ఊరికే కెలుకుతున్నట్లు సాధారణ జనానికి సైతం అర్దమవుతుంది. మరి ఆయనకే అవసరం ఉందో అంటూ జనం సైతం చెవులు కొరుక్కుంటున్న పరిస్ధితి.
తాజాగా కేసీఆర్ సైతం..
ఒకప్పటి తన రాజకీయ గురువు, అనంతరం చిరకాల ప్రత్యర్ధిగా మారిన చంద్రబాబును వీలు చిక్కినప్పుడల్లా ఏదో రకంగా ఇరుకున పెట్టేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తుంటారు. ఒకప్పుడు హైదరాబాద్ లో ఉంటే తన ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని భయపడి అమరావతి వచ్చేసిన చంద్రబాబు ఇప్పుడు రెండు నెలలుగా హైదరాబాద్ లోనే ఎలాంటి జంకూ లేకుండా కాలక్షేపం చే్స్తున్నారు. ఇప్పుడు ఆయనకు ఫోన్ల ట్యాపింగే కాదు ఇతరత్రా భయాలు లేనట్లే కనిపిస్తున్నాయి. ఇది సహజంగా కేసీఆర్ లాంటి వారికి కూడా ఏదో వెలితిగా కనిపిస్తున్నట్లుంది. దీంతో చంద్రబాబుపై చిన్నా చితకా ఆరోఫణలు చేయకుండా ఏకంగా జల వివాదాల్లోకి లాగేశారు కేసీఆర్. అప్పట్లో పాలమూరు-రంగారెడ్డికి చంద్రబాబు ఒప్పుకోలేదా అంటూ గురిపెట్టారు. అక్కడితో ఆగకుండా చంద్రబాబు గతంలో ప్రతీ దానికీ బస్తీమే సవాల్ అనే వాడు, తొడగొట్టేవాడు, బాబ్లీ వంటి బోగస్ పంచాయతీలు పెట్టేవాడు అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు.
Recommended Video
ఆయినా మౌనం- చంద్రబాబు చాతుర్యం..
రాజకీయ ప్రత్యర్ధులు ఎంత ఇరుకునపెడుతున్నా, కరోనా సంక్షోభాన్ని అడ్డుపెట్టుకుని తనపై విమర్శలకు దిగుతున్నా, గతాన్ని తవ్వుతూ ప్రజల్లో దోషిగా నిలబెడుతున్నా చంద్రబాబు మాత్రం మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితం నేర్పిన అనుభవమో, రాజకీయాల్లో సహజంగా వాడే సమయస్ఫూర్తో తెలియదు కానీ చంద్రబాబు మాత్రం అనువుగాని చోట అధికులమనరాదన్న సామెతను పాటిస్తున్నట్లే కనిపిస్తోంది. ఓవైపు కరోనా వైరస్ సంక్షోభం పట్టి పీడిస్తున్న వేళ ప్రతిపక్ష నేత అయి ఉండి సొంత రాష్ట్రం ఏపీలో ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడం, మరోవైపు పోతిరెడ్డిపాడు వివాదంలో ఏం మాట్లాడినా ఇబ్బంది తలెత్తే ప్రమాదం పొంచి ఉండటం, వైజాగ్ గ్యాస్ లీక్ బాధితుల పరామర్శకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడం ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ ఎదురు తంతున్న పరిస్ధితుల్లో మౌనాన్ని ఆశ్రయించడమే మేలని చంద్రబాబు భావిస్తున్నట్లుంది.