'ఉన్నపలంగా ఎన్నికలొస్తే గెలుపు వైసీపీదే'; సమర్థత మెరుగుపరుచుకోవాలంటున్న బాబు
విశాఖపట్నం: ఏపీలో ఉన్నపలంగా ఎన్నికలు జరిగితే.. విజయం వైసీపీనే వరిస్తుందని ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజాదరణ తమకే ఉందని టీడీపీ భావిస్తే.. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్దపడాలని సవాల్ విసిరారు.
వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే కేంద్రంలో మద్దతు తెలుపుతామని తెలిపారు. ప్రస్తుతం సమాజంలో ప్రజాస్వామిక విలువలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డి వాటిని రక్షించాల్సిన బాధ్యత మీడియాపై ఉందని గుర్తు చేశారు.
ఎన్ని గంటలు కాదు ఎంత సమర్థత అనేది ముఖ్యం : చంద్రబాబు
పారిశుద్ధ్యం, అంటువ్యాధుల నియంత్రణపై శనివారం ఉదయం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. 'ఎన్ని గంటలు పనిచేశామన్నది కాదు.. ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నామన్నదే ముఖ్యం' అంటూ అధికారులకు సూచించారు.
ఆలోచనలు, కార్యాచరణ స్వచ్చంగా ఉండేలా చూసుకోవాలని, వాటిని స్వచ్చందంగా అమలు చేసినప్పుడే స్వచ్చ ఆంధ్రప్రదేశ్ తో పాటు స్వచ్చ భారత్ కల నెరవేరుతుందని స్పష్టం చేశారు. అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పించినా పనితీరులో మార్పు రాకపోతే వసతుల కల్పన నిరుపయోగమన్నారు.
పారిశుద్ధ్యం మెరుగు, అంటువ్యాధుల నియంత్రణను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలదేనని చెప్పారు. దోమలపై దండయాత్రను మరో రెండు నెలలు పొడిగించాలని, 2017నాటికి రాష్ట్రంలో 3వేల పంచాయితీలు ఓడీఎఫ్ కావాలనీ అధికారులను ఆదేశించారు.