చంద్రబాబు ఆలోచనలే ప్రతికూలం, ఐదేళ్లలో ఏమీ చేయలేదు, విజయసాయిరెడ్డి ఫైర్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆలోచనలు ప్రతికూలమని విమర్శించారు. నెగిటివ్ థింకింగ్తో ముందుకు సాగుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక కోర్టులో పిటిషన్లు వేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు చేసే ఆరోపణలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు జన్మించడం రాష్ట్ర ప్రజల దురదృష్టకరమని విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు చేసింది శూన్యమని విమర్శించారు. ఏపీలో సంక్షేమ పథకాలను జగన్ అమలు చేస్తుంటే చూస్తూ ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజల్లో దుష్ర్ఫచారం చేస్తున్నారని ఆరోపించారు. కానీ ప్రజలు సత్యమెంటో గ్రహిస్తారని తెలిపారు.
అనుభవం ఉన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు ఏం చేశారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఏమీ చేయకపోగా.. జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని తెలిపారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఉద్యోగులను బదిలీ చేయడం సాధారణ విషయని చెప్పారు. ఏ ప్రభుత్వమైనా బదిలీ చేస్తుందని చెప్పారు. జగన్ సర్కార్ కొత్తగా చేసిందేమీ లేదన్నారు.
ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయడం మంచి పద్దతి కాదన్నారు. అమరావతి రాజధాని విషయంలో ఎక్స్పర్ట్ కమిటీ సిఫారసులు, నివేదిక ఆధారంగా నిర్ణయం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో గత ప్రభుత్వం ఏమీ పనులు చేయలేదని విజయసాయిరెడ్డి అన్నారు. పనులు చేసి ఉంటే కనిపించేవని చెప్పారు.