తండ్రీ కొడుకులు.. తోక పార్టీ దత్తపుత్రుడు మాత్రమే..: చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై విజయసాయి
అమరావతి: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి. మాలోకం అంటూ నారా లోకేష్పైనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు.
తండ్రీ కొడుకులు.. తోక పార్టీ దత్తపుత్రుడు మాత్రమే..
‘వల్లభనేని వంశీ వదిలిన సవాళ్లకు తెలుగుదేశం పార్టీ జవాబిచ్చే పరిస్థితిలో ఉందా? మాలోకం ఏదో అన్నాడు కాని ఎవరూ పట్టించుకోలేదు. మునిగిపోయే పార్టీ అని అందరికీ అర్థమైంది. చివరకు తండ్రీకొడుకు, తోక పార్టీ దత్తపుత్రుడు మాత్రమే మిగులుతారు. ఎల్లో మీడియా కూడా షాక్ నుంచి తేరుకోనట్టుంది' అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.
బంగారు బాతు అందుకేనా బాబూ..
‘'బంగారు బాతు' అమరావతిని చంపేశారని చంద్రబాబు గారు శోకాలు పెడుతున్నదెందుకో ఇప్పుడర్థమైంది. అమరావతిలో తాత్కాలిక భవనాల కాంట్రాక్టు పొందిన సంస్థ రూ.500 కోట్లు ముట్ట చెప్పిందని ఇన్కంటాక్స్ వాళ్లు బయట పెట్టిన తర్వాత లింకులు, బొంకులన్నీ ఒక్కటొకటిగా వెలుగు చూస్తున్నాయి' అని విజయసాయి ఆరోపించారు.
నిత్యకళ్యాణం అంటూ పవన్ కళ్యాణ్పై..
‘భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని, జాతీయ జెండా రూపకర్త నెహ్రూ, స్వాతంత్రం 1940లో వచ్చిందని చెప్పి అజ్ణానాన్ని బయట పెట్టుకున్న ‘నిత్యకళ్యాణం' ఢిల్లీ వెళ్లి ఏ భాషలో మాట్లాడుతున్నాడో. హిందీ, ఇంగ్లీష్ రాకుంటే అక్కడ హోటల్లో భోజనం కూడా ఆర్డర్ ఇచ్చుకోలేం' అని ఎంపీ విజయసాయి తీవ్రంగా విమర్శించారు.
పార్లమెంటులో పోలవరం ప్రస్తావన..
ఇక ఢిల్లీలో విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టు విషయంలో విపక్షాల వైఖరిని అఖిలపక్ష సమావేశం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం విజయసాయి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనాన్ని వృథా కాకుండా చేయగలిగామని తెలిపిన ఆయన.. ప్రాజెక్టుకు సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేషన్ను ఆమోదించాలని విజ్ఞప్తి చేశామన్నారు. రాష్ట్రంలో 7 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు.
కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు..
యూపీఏ హయాంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉంచారని.. ఇప్పుడేమో పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు చిదంబరంకు అనుమతివ్వాలని కోరడం కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని విజయసాయి విమర్శించారు. సోమవారం నుంచి 20 రోజులపాటు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయని, 25 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుందన్నారు.