పవన్ను అభినందించాల్సిందే: విజయసాయి, ‘జగన్ హృదయాలను గెలిచారు’
అమరావతి/విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యణ్ తలపెట్టిన బస్సు యాత్రపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ప్రస్తుతం మూడు రోజుల యాత్ర నిమిత్తం పవన్ కళ్యాణ్.. తిరుమలలో బస చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పోరాడేందుకు తాను బస్సు యాత్ర చేపట్టినట్టు పవన్ వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు.
పవన్ను అభినందించాల్సిందే..
సమస్యలపై ఎవరు పోరాటం ప్రారంభించినా తనకు సంతోషమేనని విజయసాయి చెప్పారు. సమస్యలపై కదిలిన పవన్ను అభినందించాల్సిందేనని, సమస్యలకు పరిష్కారం లభిస్తే ఇంకా ఆనందమని వ్యాఖ్యానించారు. కాగా, పవన్ బస్సు యాత్ర చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభమై శ్రీకాకుళం వరకూ సాగనుందన్న సంగతి తెలిసిందే.
పవన్ తిరుమల సందర్శన
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత హంపి మఠంలో బస చేశారు. గతంలో హత్యకు గురైన అభిమాని వినోద్రాయల్ కుటుంబసభ్యులను కలిశారు. జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత నిర్మాణంపై కసరత్తు చేసినట్టు, అందుకోసం కొన్ని పత్రాలు సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. అనంతరం గదిలోనే ఒంటరిగా ధ్యానంలో నిమగ్నమయ్యారని పార్టీ శ్రేణులు తెలిపారు. కాగా, సోమవారం జాపాలి ఆంజనేయస్వామి ఆలయంతో పాటు అభయాంజనేయస్వామి ఆలయాలను పవన్ సందర్శించుకున్నారు.
హృదయాలను గెలిచిన జగన్..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రజాసంకల్ప యాత్రను 2000 కిలోమీటర్ల మేర పూర్తి చేసిన నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా ఆయనను అభినందించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రజాసంకల్ప యాత్ర ద్వారా ఏపీ ప్రజల్లో తిరిగి ఆత్మవిశ్వాసం నెలకొల్పారని పేర్కొన్నారు. జగన్ నాయకత్వాన్ని ఖచ్చితంగా ఏపీని తిరిగి అగ్ర పథాన నిలబెడుతుందని రోజా సెల్వమణి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ప్రజల హృదయాలను గెలిచారని వ్యాఖ్యానించారు.
Recommended Video
జగన్కు ఘన స్వాగతం
ఇది ఇలా ఉండగా, సోమవారం పశ్చిమగోదావరి జిల్లా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమైంది. దెందులూరు నియోజకవర్గంలోని ఏలూరు గ్రామీణ మండలంలోకి జగన్ ఆదివారం సాయంత్రం ప్రవేశించారు. సోమవారం ఉదయం కొవ్వాడలంక వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ప్రజల సమస్యలు వింటూ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. శ్రీపర్రు, మాదేపల్లి మీదుగా జగన్ పాదయాత్ర సాగుతోంది. జగన్ పాదయాత్ర 2వేల కి.మీలు పూర్తి చేసిన సందర్భంగా ఆయనకు వైసీపీ ఘనస్వాగతం పలికారు. కాగా, సోమవారం సాయంత్రం ఏలూరులో జగన్ బహిరంగ సభ నిర్వహిస్తారు.