ఎర్రన్నాయుడు ప్రాధేయపడినా విజనరీ వినలే.. ఉత్తరకుమారుడొచ్చినా ఏం జరగలే : విజయసాయి పంచ్
టిడిపి అధినేత,మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మీద, చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్ మీద వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ ను బీసీలకు జరిగిన అన్యాయంగా రంగు పులుముతున్న బాబు ఆయన కుటుంబానికి చేసిన అన్యాయం మరిచిపోయారా అంటూ గతాన్ని తవ్వి తీశారు. ఇక నారా లోకేష్ టార్గెట్ గానూ విజయసాయి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఆ కుటుంబానికి అన్యాయం చేసిన కథ చెప్పిన విజయసాయి
ఎర్రన్నాయుడు కుటుంబానికి చంద్రబాబు తీరని అన్యాయం చేశారని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. 2002 లో బాలయోగి దుర్మరణంతో లోక్సభ స్పీకర్ పదవికి తనను ఎంపిక చేయాలని ఎర్రన్నాయుడు ప్రాధేయపడినప్పటికీ ఆయనకు అవకాశం ఇవ్వలేదన్నారు. ఎక్కడ ఎదిగిపోతాడో అన్న భయంతో ఏ పోస్టు దక్కనీయకుండా చేశారు 'విజనరీ' అంటూ చంద్రబాబునాయుడుని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. ఇక అచ్చెన్నాయుడు కుటుంబానికి అన్యాయం చేసింది చంద్రబాబేనని సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కూసాలు కదులుతుంటే పొంతన లేకుండా మాట్లాడటం కామన్
చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ని ఉత్తరకుమారుడిగా అభివర్ణించారు విజయసాయిరెడ్డి. కరోనా వైరస్ లాక్ డౌన్ తర్వాత ఫీల్డ్ కొస్తా.. అంతు చూస్తా అని చిటికెలేసిన ఉత్తరకుమారుడు ముందే వచ్చాడు వెళ్ళిపోయాడు.. ఏదీ, ఏం జరగలేదే? అంటూ ఎద్దేవా చేశారు. ఒకపక్క కూసాలు కదులుతుంటే పొంతన లేకుండా మాట్లాడటం కామన్ అంటూ నారా లోకేష్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.ఇక అచ్చెన్నాయుడు తమ గుట్లన్నీ ఎక్కడ బయటకు కక్కుతాడో అని భయంతో అబ్బా కొడుకులకు నిద్రపట్టడం లేదంట అంటూ విమర్శలు గుప్పించారు విజయసాయి రెడ్డి.
Recommended Video
ఆ పని చేస్తే బయటపడొచ్చేమో .. అచ్చెన్నకు సలహా
అంతేకాదు అచ్చెన్న ఖచ్చితంగా బాబు గారి బినామీనే .ఆయన ద్వారానే భూముల కొనుగోళ్లు, వ్యాపారాల్లో వేల కోట్ల పెట్టుబడులు పెట్టారని సొంత పార్టీలో చర్చించుకుంటున్నారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బాబు రాయమంటేనే సిఫారసు లేఖలు రాశారని అంగీకరించి, గుట్టుమట్లన్నీ చెప్పేస్తే కేసు నుంచి బయట పడవచ్చేమో చూడండి అచ్చెన్న అంటూ మరో ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి . ఏం జరిగినా,ఈ కేసును దర్యాప్తు చేస్తున్నా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టార్గెట్ మాత్రం చంద్రబాబు, లోకేష్ లే. ప్రతిదాంట్లో వారి పాత్ర ఉందంటూ, పార్టీలోనే చర్చ జరుగుతుందంటూ ఆసక్తికర అంశాలను వెల్లడిస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నారు విజయసాయిరెడ్డి.