విజనరీ...సొంత ఎమ్మెల్యేలతో ఓటు వేయించుకోలేక బొక్కబోర్లా పడ్డాడేమిటి : విజయసాయి సెటైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో మరోమారు వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి అనవసరంగా పరువు పోగొట్టుకుంది. ఇక ఈ పరిస్థితి వైసీపీ నేతలకు అస్త్రంగా మారింది. నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడును సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఛీ కొట్టారని, అందుకే వారు ఓటు వేయలేదని విమర్శనాస్త్రాలు సంధించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి , తాజాగా మరోమారు చంద్రబాబునాయుడు టార్గెట్ గా నిప్పులు చెరిగారు.
Recommended Video
లోకేష్ పై చంద్రబాబుకు విజయసాయి రెడ్డి సెటైర్ ... కుమారుడు విప్లవ యోధుడిలా కనిపించి ఉంటాడు
చంద్రబాబు బిరుదులూ ఏకరువు పెట్టిన విజయసాయి
ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోయినా దళిత నేత వర్ల రామయ్య ఎన్నికల బరిలోకి దింపి సొంత పార్టీ ఎమ్మెల్యేలతో కూడా ఓటు వేయించుకోలేకపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ గా వ్యంగ్యాస్త్రాలు సంధించారు వైసీపీ నేతలు. ఇక ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబుని గతంలో ఆయనకు అనుకూలంగా ఉన్న ఎల్లో మీడియా తెగ బిరుదులు ఇచ్చేసింది అంటూ వ్యాఖ్యలు చేశారు.
దేశ రాజకీయాలను బొంగరంలా తిప్పిన ఉద్దండుడు .. విజయసాయి వ్యంగ్యం
కింద జాకీలు, పైన క్రేన్ లతో ఆకాశానికెత్తిన ఎల్లో మీడియా బాబు గారికి తగిలించిన బిరుదులు అంటూ చంద్రబాబు బిరుదులు ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.చాణిక్యుడు, వ్యూహకర్త , దేశ రాజకీయాలను బొంగరంలా తిప్పిన ఉద్దండుడు, 20-30 ఏళ్ల ముందస్తు ఆలోచనలు చేసిన విజనరీ .. అంటూ తెగ బిరుదులు ఇచ్చేశారని ఆయన పేర్కొన్నారు. మరి అలాంటి విజనరీ సొంత పార్టీ ఎమ్మెల్యేలతో కూడా ఓటు వేయించుకో లేక బొక్క బోర్లా పడ్డాడేమిటి ? ఏమిటి ఈ పరాభవం అంటూ చంద్రబాబును ఎద్దేవా చేశారు విజయసాయి రెడ్డి.
కరోనా సమయంలోనూ ఇచ్చిన హామీలను నెరవేర్చిన సీఎం
ఇక మరో ట్వీట్లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలన్నింటిని నెరవేరుస్తున్నారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా కష్టకాలంలోనూ మాట తప్పకుండా హామీలను అమలు చేస్తున్నారు యువ ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి వైయస్సార్ నేతన్న హస్తం కార్యక్రమం ప్రారంభంపై ప్రశంసల జల్లు కురిపించారు. 80 వేలకు పైగా నేతన్నల కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.
మాటల్లో కాదు చేతల్లో చూపే పార్టీ వైసీపీ అన్న విజయసాయి
ఆరు నెలల ముందుగానే నేతన్నల ఖాతాలో డబ్బు జమ చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ అంటూ ఆయన పేర్కొన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విషయమైనా మాటల్లో కాదు, చేతల్లో చూపే నిజమైన బడుగుల పార్టీ అంటూ మరో ట్వీట్ లో పేర్కొన్నారు విజయసాయి రెడ్డి. ఇక తాజా పరిస్థితులు టీడీపీకి ఏ మాత్రం అనుకూలంగా లేవని , టీడీపీ ఏదో చెయ్యాలని ప్రయత్నం చేస్తే అవి టీడీపీకే రివర్స్ షాక్ ఇస్తున్నాయని ప్రస్తుతం ఏపీలో చర్చ జరుగుతుంది. టీడీపీ ఇచ్చిన ప్రతి అవకాశాన్ని విజయసాయి వాడుకుంటున్నారని విమర్శలకు తెరతీస్తున్నారని దీంతో అర్ధం అవుతుంది.