చేసేది లేక చిల్లర మాటలు, ఇంకో పాతికేళ్ళు ఏడుస్తూనే ఉండండి : టీడీపీ నేతలపై విజయసాయి ధ్వజం
ఏపీలో అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ ఏ పథకాన్ని తీసుకు వచ్చినా, ప్రతిపక్ష పార్టీ దానికి సంబంధించి విమర్శలు చేస్తూనే ఉంది. ఆ పథకాలన్నీ టిడిపి హయాంలో ఉన్నవే అని, వాటికి పేర్లు మార్చి వైసీపీ ఇప్పుడు తాము కొత్తగా ప్రవేశపెట్టిన పథకాల పేరుతో ప్రచారం చేసుకుంటోందని టిడిపి నేతలు నిప్పులు చెరుగుతున్నారు. అంతేకాదు వైసిపి హయాంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
చంద్రం .. మీ కుట్ర విఫలం .. వైఎస్సార్ ఆసరా సఫలం : విజయసాయి ఫైర్
టీడీపీ నేతలు పేదలపై ఉన్న కడుపుమంట కక్కేస్తున్నారు
వైసీపీ నేతలు, టిడిపి నేతల విమర్శలకు దీటుగా సమాధానం చెబుతున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబును, టిడిపి నేతలను టార్గెట్ చేసి సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోయే విజయసాయిరెడ్డి తాజాగా ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగనన్న విద్యా కానుక పేరుతో పేదలపై ఉన్న కడుపు మంటను కక్కేస్తున్నారు పచ్చ నేతలు అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు విజయసాయిరెడ్డి. పార్టీ రంగులు ఉన్నాయని కొందరు, టిడిపి కూడా ఇచ్చిందని మరికొందరు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
చేసేది లేక చిల్లర మాటలు .. మరో 25 ఏళ్ళు ఏడుస్తూనే ఉండండి
హై క్వాలిటీ కిట్లను అందించడంతో ఇక చేసేది లేక చిల్లర మాటలు మాట్లాడుతున్నారు అంటూ నిప్పులు చెరిగారు విజయసాయిరెడ్డి. అంతేకాదు ఇంకో పాతికేళ్లు ఏడుస్తూనే ఉండండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంటే ఇంకో పాతికేళ్ల పాటు టిడిపి అధికారంలోకి రాదు, వైసీపీ అధికారంలో ఉంటుంది అన్న తన అభిప్రాయాన్ని ఈ వ్యాఖ్యల ద్వారా వ్యక్తం చేశారు విజయ సాయి రెడ్డి. ఇదే సమయంలో బాబు అనుకూల మీడియాపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.
దేశ ప్రజల ముందు లక్షోసారి అడ్డంగా దొరికారు
బాబు అను'కుల' మీడియా దేశ ప్రజల ముందు లక్షోసారి అడ్డంగా దొరికిపోయింది . జాతీయ మీడియా హెడ్లైన్స్ లో రాసిన వార్తను , జాతి మీడియా ముసుగేసి దాచాలని చూసింది అంటూ ఆయన విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా ఊరుకుంటుందా .. పచ్చపాతాన్ని ఉతికి ఆరేసింది అంటూ ఆయన అధికార పార్టీకి ప్రతికూలంగా వార్తలు రాస్తున్న మీడియాపై నిప్పులు చెరిగారు. సోషల్ మీడియా అధికార పార్టీకి అండగా ఉందని చెప్పుకున్నారు. ఇకనైనా మా కోడి కూస్తేనే తెల్లారుతుంది అనే భ్రమలు వీడక తప్పదు అంటూ విజయ సాయి రెడ్డి వ్యాఖ్యానించారు.
Recommended Video
సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విజయసాయి .. టార్గెట్ టీడీపీ
ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా టీడీపీ అధినేత చంద్రబాబును, నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ , టిడిపి నేతల విమర్శలకు దీటుగా సమాధానం చెప్తూ విజయ సాయి రెడ్డి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. నిన్నటికి నిన్న చంద్రబాబు, నారా లోకేష్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి ఇంకెంతకాలం అవుట్ డేటెడ్ బుర్ర ను వాడతావు మాలోకం అంటూ లోకేష్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక తాజాగా టిడిపి నేతలు మరో 25 ఏళ్ళపాటు ఏడుస్తూనే ఉండండి అంటూ వ్యాఖ్యలు చేశారు.