ఆ నేరం రుజువైంది, ఇంకెంతమందిని మేనేజ్ చేస్తావు బ్రీఫ్డ్ బాబు?న్యూ ఇయర్ లోనూ టీడీపీ టార్గెట్ గా ఎంపీ సాయిరెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబుపై, టిడిపి నేతలపై నిత్యం విరుచుకుపడే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త సంవత్సరంలో కూడా చంద్రబాబును టార్గెట్ చేశారు. 2021 జనవరి 1వ తేదీనే చంద్రబాబు పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఓటుకు నోటు సూత్రధారులు, పాత్రధారులు పెద్దబాబు , చినబాబేనని తేలిపోయింది అంటూ సోషల్ మీడియా వేదికగా సంచలన విషయాలు వెల్లడించారు విజయసాయిరెడ్డి.
ఓటుకు నోటు సూత్రధారి , పాత్రధారులు పెద్దబాబు చంద్రబాబే
ట్విట్టర్ వేదికగా పెట్టిన పోస్ట్ లో చంద్రబాబును టార్గెట్ చేశారు . ఓటుకు నోటు సూత్రధారి , పాత్రధారులు పెద్దబాబు చినబాబేనని తేలిపోయింది. నేరం చేయడమే కాదు కవర్ అప్ చేయడం కోసం ప్రయత్నించారని ఈడీకి ముత్తయ్య ఇచ్చిన స్టేట్ మెంట్ లో రుజువైంది అంటూ పేర్కొన్నారు. వేరే రాష్ట్రాల్లో ఎన్నికల్లో మేనేజ్ చేసేందుకు ఆంధ్రాను కొల్లగొట్టారు.. ఇంకెంత మందిని మేనేజ్ చేస్తావు బ్రీఫ్డ్ బాబు ? అంటూ నూతన సంవత్సరం తొలి రోజే చంద్రబాబును టార్గెట్ చేశారు.
విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబుపై షాకింగ్ కామెంట్స్
అంతేకాదు విశాఖలోనూ టిడిపి ఎమ్మెల్యేలను విజయ సాయి రెడ్డి వదిలిపెట్టడం లేదు. మొన్నటికి మొన్న విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ని టార్గెట్ చేసి అవినీతి ఆరోపణలు చేసిన విజయ సాయి రెడ్డి, ఇప్పుడు విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గణబాబుపై విరుచుకుపడుతున్నారు. తాజాగా గణబాబు జిల్లా పరిషత్ స్థలం కబ్జా చేసి అందులో నరసింహ థియేటర్ నిర్మాణం చేపట్టారని విశాఖ పశ్చిమ నియోజకవర్గం లో జరిగిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం లో సంచలన ఆరోపణలు చేశారు విజయసాయిరెడ్డి.
వందమంది చంద్రబాబులు అడ్డొచ్చినా రాజధాని తరలింపు ఆగదు
ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన ఎంతటివారినైనా విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు కబ్జా చేసిన ప్రభుత్వ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్న విజయ సాయి రెడ్డి రాజధాని తరలింపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వందమంది చంద్రబాబులు అడ్డొచ్చినా రాజధాని తరలింపు ఆగదు అంటూ సంచలనం సృష్టించారు. రాజధానికి అనుకూలమైన ప్రాంతం విశాఖ అని విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును, టిడిపి నేతలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు .కొత్త సంవత్సరం నాడు కూడా చంద్రబాబు ని టార్గెట్ చేసిన విజయసాయి ఓటుకు నోటు వ్యవహారంపై షాకింగ్ ట్వీట్ చేశారు.
ఏపీకి ఈ ఏడు కలిసి రావాలనే విజయసాయి ఆకాంక్ష
ఇదే సమయంలో కరోనా మహమ్మారి యొక్క విషాద జ్ఞాపకాలను వదిలి కొత్త మరియు ప్రతిష్టాత్మక ప్రయాణానికి ఇది సమయం అంటూ పేర్కొన్నారు విజయసాయి రెడ్డి . మనందరికీ వ్యక్తిగతంగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2021 ఉత్తమ సంవత్సరాల్లో ఒకటి అవుతుందని ఆశిస్తున్నాము. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు .