చంద్రబాబును నమ్మిన వాళ్లెవరూ బాగుపడ్డ చరిత్ర లేదు... తస్మాత్ జాగ్రత్త.. విజయసాయి రెడ్డి హితవు
నిత్యం చంద్రబాబును సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న విజయసాయిరెడ్డి, తాజాగా ఏలూరు ఎన్నికలలో వైసీపీ విజయం సాధించడం, టిడిపి బొక్క బోర్లా పడడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును నమ్మిన వాళ్లు ఎవరూ బాగుపడ్డ చరిత్ర లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి ఏలూరులో ఓటమిపై ట్విట్టర్ వేదికగా తూర్పారబట్టారు. ఇక టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సైరా పంచ్ వేశారు.
నారా లోకేష్ కు విజయసాయి రెడ్డి సైరా పంచ్
ఏలూరు కార్పొరేషన్ లో విజయం సాధించడంపై సైరా పంచ్ వేసిన విజయసాయిరెడ్డి మొత్తం ఏలూరు కార్పొరేషన్లో యాభై డివిజన్లు ఉంటే 47 డివిజన్ వైఎస్ఆర్సిపి ఖాతాలో చేరాయని, కేవలం మూడు మాత్రమే టిడిపి దక్కించుకోగలిగిందని పేర్కొంటూ మాకు టైం వస్తుంది.. తిరిగి కొట్టించుకున్నాం... 3తో సరిపెట్టుకున్నామంటూ నారా లోకేష్ చెప్తున్నట్లుగా ఒక పోస్ట్ ని ట్వీట్ చేశారు. ఇటీవల కాలంలో నారా లోకేష్ అనేకమార్లు టిడిపి కి టైం వస్తుందంటూ, అప్పుడు ఖచ్చితంగా అంతకంతా ప్రతీకారం తీర్చుకుంటామంటూ చేస్తున్న వ్యాఖ్యలకు సెటైర్ గా ఈ పంచ్ చేశారు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.
కోవర్ట్ ల నాటకాలు రక్తి కట్టడం లేదని అమాయక ప్రజలు బలిపశువులుగా
ఇదే సమయంలో చంద్రబాబుపై విరుచుకుపడ్డ విజయసాయిరెడ్డి బాబు రాజకీయ వైకుంఠపాళిలో సామాన్య ప్రజలను సైతం సమిధలుగా చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక కోవర్ట్ ల నాటకాలు రక్తి కట్టడం లేదని, దీంతో అమాయక ప్రజలని బలిపశువులుగా మారుస్తున్నారని మండిపడ్డారు. తన నోటితో అనలేనివి వాళ్ళతో చెప్పించి చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నారని విరుచుకుపడ్డారు విజయసాయిరెడ్డి. బాబును నమ్మిన వాళ్ళు ఎవరూ బాగుపడ్డ చరిత్ర లేదని తస్మాత్ జాగ్రత్త అంటూ చంద్రబాబు ఆడమన్నట్టు ఆడుతున్న వాళ్లకు సాయి రెడ్డి హితవు పలికారు.
Recommended Video
ఏలూరులో చంద్రబాబు ఎగిరిపోయాడు ..2024 ఎన్నికలలోనూ కష్టమే
అంతేకాదు ఏలూరును ఏలేదెవరో తేలిపోయింది అంటూ ప్రభుత్వ వ్యతిరేకత పచ్చ మీడియాలో తప్ప ప్రజల్లో లేదంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి సింగిల్ డిజిట్ కే టిడిపి పరిమితమైందని చంద్రబాబు ఏలూరు నుండి ఎగిరిపోయాడు అంటూ ట్వీట్ చేశారు. ఇక 2024 ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫలితమే పునరావృతమవుతుంది రాసి పెట్టుకో బాబు అంటూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ టీడీపీ గెలిచే సీన్ లేదని తేల్చి చెప్పారు విజయసాయి రెడ్డి.
టీడీపీతో మైండ్ గేమ్ ఆడుతున్న సాయిరెడ్డి .. టీడీపీ ఖాళీ అంటూ టార్గెట్
ఇప్పటికే టీడీపీ తో మైండ్ గేమ్ ఆడుతున్న విజయసాయిరెడ్డికి మళ్ళీ ఏలూరు ఎన్నికలు చంద్రబాబును టార్గెట్ చెయ్యటానికి ఆయుధంగా మారాయి. టీడీపీ పని అయిపోయిందని, చంద్రబాబు దుకాణం సర్దేయాలని పదేపదే విజయసాయి టీడీపీ బలహీనం అయ్యింది అంటూ చేస్తున్న వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులకు ఇబ్బందికరంగా మారాయి. ఇప్పటికే పార్లమెంట్ లో ఏపీ ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్ట్ గురించి పోరాటం చేస్తున్న వైసీపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు దొంగ దీక్షలకు పరిమితం అయ్యారని టార్గెట్ చేస్తున్నారు. ఏపీలో టీడీపీ పని అయిపోయిందని తేల్చి చెప్తున్నారు.