ఏపీలో చట్టం ఎవరికీ చుట్టం కాదు..గుండ్రాయిలా ఉన్నా డ్రామాలేంటి అచ్చన్నా? : విజయసాయిరెడ్డి
వైసీపీ ఎంపీ విజయ సాయి టీడీపీ నేతలను టార్గెట్ చేసి వారిపై విమర్శనాస్త్రాలు సంధించారు . తనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని కోర్టును కోరిన అచ్చెన్నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ఆరోగ్యంగా గుండ్రాయిలా ఉన్నా ఈ డ్రామాలేంటి అచ్చన్నా? కార్పొరేట్ ఆసుపత్రి కావాలా? ఏం ఈ ఎస్ ఐ ఆస్పత్రి వద్దా? మీ సిబీఎన్ హయాంలోలా కాదు జగన్ గారి ప్రభుత్వం .ఆస్పత్రులకు అన్ని హంగులు అద్దింది. సమస్య వస్తే చూసుకుంటుంది అంటూ అచ్చెన్నాయుడు కు కౌంటర్ వేశారు.
చంద్రబాబు గుడ్డి విజనరీ ..జగన్ సైకో ప్రిజనరీ : విజయసాయి, అయ్యన్నల మాటల యుద్ధం
నివేదిక వచ్చిన 24 గంటల్లోనే సీఈవోతో సహా 12మంది అరెస్ట్
చట్టం తన పని తాను చేసుకోవడం అంటే ఇదే నివేదిక వచ్చిన 24 గంటల్లోనే ఎల్జి పాలిమర్స్ కు సంబంధించిన సీఈవోతో సహా 12మందిని అరెస్ట్ చేశారని ,ఒక విదేశీ ఎమ్మెన్సీ సిఈఓను అరెస్ట్ చేయడం దేశంలో ఇదే ప్రథమమని పేర్కొన్నారు. భోపాల్ యూనియన్ కార్బైడ్ నుండి ఇప్పటివరకు నిందితులు విదేశాలకు పారిపోవడమే చూశామని కానీ ఆంధ్రాలో చట్టం ఎవరికీ చుట్టం కాదని పేర్కొన్నారు విజయసాయి రెడ్డి .
వర్ల వర్లినా దొర్లినా బాబు చట్ట సభకు పంపడని సెటైర్
ఇదే సమయంలో విజయసాయి రెడ్డి మాటకు మాట వినిపిస్తున్న వర్ల రామయ్య కూడా టార్గెట్ చేశారు. నువ్వెంత వర్లినా, దొర్లినా మీ బాబు నిన్ను చట్టసభకు పంపడు. రాజ్యసభ ఎన్నికల్లో మీ పరాభవాన్ని అర్థం చేసుకోగలం. ప్రస్టేషన్ పీక్స్ కు వెళ్లినట్టు ఉంది . అవును.. పెద్దల సభలో ఉద్దండులే కూర్చుంటారు .ఆధారాలు లేకుండా చిల్లర మాటలు మాట్లాడే వారికి అక్కడ చోటు లేదు అంటూ వర్ల రామయ్య కు గట్టిగానే పంచ్ వేశారు.
చీమకు హాని చేయడు కాని మనుషుల్ని మర్డర్ చేయిస్తాడు.. రవీంద్ర పై సైరా పంచ్
అంతేకాదు చంద్రబాబు కొల్లు రవీంద్ర చీమకు కూడా హాని చేయడు అంటూ చేసిన వ్యాఖ్యలపై అవును చీమకు హాని చేయడు కాని మనుషుల్ని మర్డర్ చేయిస్తాడు అంటూ సైరా పంచ్ వేశారు విజయసాయిరెడ్డి. అంతేకాదు చట్టం తన పని తాను చేసుకోవడం అంటే ఇదే అంటూ ఆయన ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై హై పవర్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత 24 గంటల్లోపే సీఎం జగన్ యాక్షన్ తీసుకున్నారంటూ పేర్కొన్నారు.ఒకపక్క ఏపీలో అధికార పార్టీ పారదర్శకంగా పనిచేస్తుందని చెబుతూనే, మరోపక్క ప్రతిపక్ష పార్టీపై మాటల తూటాలను పేలుస్తూ, తనదైన శైలిలో పోస్టులు పెడుతున్నారు విజయసాయిరెడ్డి.
ప్రైవేట్ ఆస్పత్రిలో అచ్చెన్న చికిత్స కోరిన నేపధ్యంలోనే పోస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తనకు అనారోగ్యంగా ఉందని, తనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపధ్యంలోనే విజయసాయి ఈ పోస్ట్ చేశారు. అంతే కాదు ప్రభుత్వ పారదర్శక పాలనకు నిదర్శనంగా ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ప్రభుత్వ చర్యలను ఉదహరించారు .