ట్రైలర్ కే కలుగులో దాక్కున్న ఎలుకలా బాబు ..చిట్టి మాలోకం చిన్నమెదడు చితికి ఇలా : విజయసాయి వ్యంగ్యం
టిడిపి చీఫ్,మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు . వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రైతు దినోత్సవం జరిపే హక్కు లేదని , రైతులను మోసం చేసిన వారు జరిపేది రైతు దగా దినోత్సవాన్ని అంటూ చంద్రబాబు,లోకేష్ లు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిపై వారి విమర్శలకు సమాధానంగా విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
రైతులను దగా చేసినవారు రైతు దగా దినోత్సవం అంటున్నారు
జగన్ హయాంలో రైతుల సంక్షేమం అందుతుందని, సున్నా వడ్డీ సొమ్ము ఇకపై నేరుగా రైతుల ఖాతాల్లోకి పంపిస్తుంది జగన్ ప్రభుత్వం అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు . చంద్రబాబు నాయుడు పెట్టిన బకాయిలను సైతం చెల్లిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు జగన్. పంటల కొనుగోలు బాధ్యత కూడా ప్రభుత్వానిదే అని ప్రకటించారు. ఇది ముమ్మాటికీ రైతు ప్రభుత్వం. రైతులను దగా చేసినవారు రైతు దగా దినోత్సవం అంటున్నారు అంటూ విజయ సాయి రెడ్డి చంద్రబాబు వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ వేశారు.
చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల టార్గెట్ గా సైరా పంచ్
చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలను టార్గెట్ చేసి సైరా పంచ్ వేశారు. గతంలో టీడీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారందరూ ఫోటోలను పెట్టి మా పాలనలో రైతులకు 90 వేల కోట్ల నిధులు ఇచ్చాం ఆ 90 వేల కోట్లు అందుకున్న నిరుపేద రైతులు వీళ్లే అంటూ పైన చంద్రబాబు ఫోటోలు పెట్టి, అందులో నాడు టిడిపి హయాంలో ప్రభుత్వ పాలనలో కీలక భూమిక పోషించిన వారి ఫోటోలను పెట్టి పోస్ట్ చేశారు.
ట్రైలర్ కే ఇలా .. నాలుగేళ్లలో అసలు సినిమా చూస్తే ఏమవుతారో!!
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలన ట్రైలర్ కే కలుగులో దాక్కున్న ఎలుకలా బాబు హైదరాబాదులో గడుపుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒక ఏడాది పాలనకే పరిస్థితి ఇలా ఉంటే వచ్చే నాలుగేళ్లలో అసలు సినిమా చూస్తే ఏమవుతారో అని విజయసాయిరెడ్డి చంద్రబాబును ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎంతో అనుభవజ్ఞుడు అని గెలిపించిన ప్రజలను ఎంగిలి విస్తరాకుల్లా విసిరేసి దోపిడీలు, స్కాములు చేస్తూ దొరికిపోయారని విమర్శించారు. ఈ దొంగల ముఠా జైలుకి వెళ్లాల్సిందే అంటూ విజయ సాయి రెడ్డి చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.
Recommended Video
తొమ్మిదేళ్ల వరుస కరువు బాబు పాలనలోనే
రైతు దినోత్సవం పై విమర్శలు గుప్పించిన నారా లోకేష్ ను టార్గెట్ చేసిన విజయసాయి చిట్టి మాలోకం చిన్న మెదడు పూర్తిగా చితికిపోయినట్లుంది. వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది చంద్రబాబు హయాంలోనే అంటూ మరో ట్వీట్ చేశారు.తొమ్మిదేళ్ల వరుస కరువును ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు.మేత దొరక్క పశువులను కబేళాలకు అమ్ముకున్న దయనీయ దృశ్యాలను ప్రపంచమంతా చూసింది. రాజన్న రాకతోనే వ్యవసాయం పండుగగా మారింది అంటూ లోకేష్ కు చురకలంటించారు.