అద్దె విమానంలో తిరిగిన పవన్ కు ఉద్దానం లో జరుగుతుంది కనిపించలేదా .. అని ప్రశ్నిస్తున్న వైసీపీ నేత
పవన్ కళ్యాణ్ పై వైసిపి నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విరుచుకుపడుతున్నారు . జనసేన అధినేత పవన్ చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్న విజయసాయి ఉద్దానంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు పవన్ కళ్యాణ్ కు కనిపించటం లేదని ఆయన మండిపడుతున్నారు.
తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెట్టిన విజయసాయి ఈ మధ్య పవన్ పై విమర్శల దాడిని పెంచారు. మొన్నటికి మొన్న చంద్రబాబుకు అజ్ఞాత పార్టనర్ అన్న ఆయన తాజాగా చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అని వ్యాఖ్యానించారు. చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని పవన్ పై మండిపడిన విజయసాయి సోషల్ మీడియాలో మరోమారు పవన్ ను టార్గెట్ చేసి మాట్లాడారు. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం పవన్ చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో పోరాటం చేసారు . బాబు ప్రభుత్వంలో ఉద్దానంలోని కిడ్నీ బాధితుల అంశంపై గళం విప్పిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడక్కడ చేపట్టిన కార్యక్రమాల గురించి పెదవి విప్పటాన్ని విజయసాయి ప్రశ్నించారు. అద్దె విమానాల్లో ఉద్దానం చుట్టూ ఎగిరిన పవన్ కల్యాణ్ కు ఇప్పుడక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 200 పడకల ఆసుపత్రి.. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పవన్ కు కనపడటం లేదా? అని విజయసాయి ప్రశ్నించారు.
ఇక పవన్ ఇప్పుడు జరుగుతున్నదంతా చూడలేక కళ్లు మూసుకున్నాడని ఎద్దేవా చేశారు విజయసాయి రెడ్డి . జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప వ్యవధిలోనే ఉద్దానం సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేసిందని చెప్పారు. ఇదే విషయాన్ని తాజా ట్వీట్ లో చెప్పిన ఆయన.. మెట్రో నగరాల్లో తప్ప రాష్ట్ర రాజధానుల్లోకూడా ఇలాంటి సదుపాయాలు లేవని.. అలాంటి వైద్య సేవల్ని ఉద్దానంలో ఏర్పాటు చేశామని చెప్పి ఇవన్నీ జగన్ ఉక్కు సంకల్పం నుంచి పుట్టుకొచ్చాయే తప్పించి గాలి మాటల్లో కాదంటూ పవన్ పై పంచ్ వేశారు . మొత్తానికి పవన్ జగన్ ప్రభుత్వాన్ని పలు అంశాలపై విమర్శిస్తుంటే పవన్ పై ఎదురుదాడి చేస్తున్నారు విజయసాయి రెడ్డి .