విజయసాయి రెడ్డి కాదు సెటైర్ల సాయి రెడ్డి ! ఇప్పుడు పవన్ పై వేశాడు
ఏపీలో ఎన్నికల ప్రచారం మరికొద్ది రోజుల్లో ముగియనున్న నేపధ్యంలో ఒకరిమీద ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాను సైతం తమదైన శైలిలో వాడుతున్నారు. మొదటి నుంచి ట్విట్టర్ వేదికగా అధికార టీడీపీని టార్గెట్ చేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అధికార పార్టీ అధినేత చంద్రబాబు మీద, చినబాబు నారా లోకేష్ మీద సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. వీరిద్దరే కాకుండా ఇప్పుడు ఈ ఖాతాలో పవన్ కళ్యాణ్ కూడా చేర్చిన విజయసాయి పవన్ కళ్యాణ్ పై ఊహించని విధంగా సెటైర్లు వేస్తున్నారు.
భూమనపై పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ .. తోక జాడిస్తే నార తీసి కూర్చోబెడతా
పవన్ టార్గెట్ గా విజయసాయి కామెంట్స్ .. వరుస ట్వీట్లతో పవన్ పై విమర్శలు
నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ తో ఉల్లి పొట్టు కూడా ఊడదు అంటూ వ్యాఖ్యలు చేసిన విజయసాయి తాజాగా తాజాగా సైరా పంచ్ అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ వాడి వేడి చర్చకు కారణమవుతుంది.
పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన ఆయన తన సంచలన వ్యాఖ్యలతో కాక పుట్టిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ ఏ రోటికాడ ఆ పాట పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు . ఆంధ్రావాళ్లను కొడుతున్నారంటూ ఇక్కడ గగ్గోలు పెట్టే పవన్, ఆంధ్రావాళ్లకు చుక్కలు చూపిస్తానని ఆ గట్టుకు వెళ్లి జబ్బలు చరుస్తున్నారని విమర్శించారు. ఇక పవన్ కళ్యాణ్ గందరగోళం చూస్తే ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ నే మించి పోయారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు పవన్ కళ్యాణ్ .
గందరగోళంలో మందలగిరి మాలోకాన్నే మించిపోయారని కామెంట్
ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘ఏ గట్టున ఉంటారో ఆయనకే తెలియదు. ఏ రోటికాడ ఆ పాట పాడేస్తున్నారు పవన్. ఆంధ్రా వాళ్ళను కొడుతున్నారంటూ ఆ గట్టుపై నిలబడి గగ్గోలు పెడతారు. తెలంగాణలో పుట్టి ఉంటే ఆంధ్రా వాళ్ళకు చుక్కలు చూపించేవాడినని ఈ గట్టున నిలబడి జబ్బులు చరుస్తారు. గందరగోళంలో మందలగిరి మాలోకాన్ని మించిపోయారు కదా!' అని పవన్ కళ్యాణ్ ను ఎద్దేవా చేశారు విజయసాయి రెడ్డి .
బాబు ఆఫర్ కు న్యాయం చెయ్యాలని నటిస్తున్న పవన్ .. విజయసాయి మరో ట్వీట్
ఇక అక్కడితో ఆగక మరో ట్వీట్ చేశారు విజయసాయి. 'కళ్ళు మూసినా తెరిచినా చంద్రబాబుకు, పవన్కు జగన్ గారే కనిపిస్తున్నారు. ఆఫర్ చేసిన ప్యాకేజీకి న్యాయం చేయడానికై ప్రయాసపడి నటిస్తున్నారు. జగన్ గారిని తిట్టకపోతే ప్యాకేజీకి బాబు కోతలు పెడతారన్న భయం కాబోలు. ముసుగులో గుద్దులాట ఎందుకు? ముసుగులు కప్పుకునేది విలన్లు, హీరోలు కాదు కదా!' అంటూ మరో సంచలన వ్యాఖ్య చేశారు. పవన్ కళ్యాణ్ పై తన ట్వీట్ల దాడి పెంచారు విజయసాయిరెడ్డి .