హోదా ముద్దాయిలకు శిక్ష తప్పదు: పార్లమెంటులో విజయసాయి హెచ్చరిక
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు జీవన్మరణ సమస్య అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంపై రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.
Recommended Video
రాజ్యసభలో ఏపీ విభజన హామీలపై చర్చ: కేంద్రాన్ని నిలదీసిన సుజన, 'బాబే సీనియర్'
నాలుగేళ్లుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతోందన్నారు. ప్రత్యేక హోదా ఏపీకి సంజీవిని అని తమ పార్టీ నమ్ముతోందన్నారు. మరోవైపు, ప్రత్యేక హోదా సంజీవిని కాదని టీడీపీ గతంలో బహిరంగంగానే ప్రకటించిందని ఆయన సభలో ప్రస్తావించగా.. టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ అడ్డుతగిలారు.
సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నప్పుడు వైసీపీ, జనసేన, వామపక్షాలు వ్యతిరేకించాయని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ఏపీకి హోదా రాకపోవడానికి తొలి ముద్దాయి బీజేపీ, రెండో ముద్దాయి టీడీపీ, మూడో ముద్దాయి కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. హోదా నిందితులను 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు తగు రీతిలో శిక్షిస్తారని చెప్పారు.
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చే నాటికే కేబినెట్ తీర్మానం అమల్లో ఉందని, గత ప్రభుత్వ తీర్మానాన్ని రద్దు చేసే అధికారం బీజేపీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా గత ప్రభుత్వం నిర్ణయాలను గౌరవించాలన్నారు. 14వ ఆర్థిక సంఘం పేరుతో బీజేపీ ప్రభుత్వం ఏపీకి హోదా ఇవ్వకపోవడం సరికాదని అన్నారు.