విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ .. ఆ విషయం చెప్పి చంద్రబాబుపై బాంబు పేల్చిన విజయసాయిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం సీఎం జగన్ కు ముందే తెలుసని, సీఎం జగన్ స్వయంగా ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నారని టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ బాధ్యతను సీఎం జగన్ తీసుకోవాలని, ఏపీ సీఎం గా కేంద్రంతో ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి పోరాటం చేయాలని చంద్రబాబు సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు.
చంద్రబాబు అబద్ధాలకు కేరాఫ్ అడ్రెస్ .. జనం నమ్మేది జగన్ నే : మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జగన్ సర్కార్ ను టార్గెట్ చేసిన టీడీపీ
ఇక తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై పార్లమెంట్లో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇవ్వడంతో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రక్రియ ఎప్పటి నుంచో సాగుతోందని అర్థమైంది. గత మూడేళ్ల కాలంగా కేంద్రం ప్రైవేటీకరణకు సానుకూలంగా ఉందని స్పష్టమైంది. 2019లో పోస్కో కంపెనీతో ఒప్పందం అయిందని విశాఖ స్టీల్ ప్లాంట్ స్థానంలో పోస్కో కంపెనీ ప్లాంట్ రాబోతోందని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలతో టిడిపి నేతలు అధికార వైసీపీని, సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి.
టీడీపీకి విజయసాయి చెక్ .. చంద్రబాబు పై బాంబు పేల్చిన విజయసాయి
టిడిపి విమర్శలకు చెక్ పెడుతూ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ చంద్రబాబు హయాంలోనే ప్రారంభమైందని ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తారని చంద్రబాబుకు తెలిసినా, అప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు రంకెలు ఎందుకు వేస్తున్నారని, రాద్ధాంతం చేయడంలో ఆంతర్యమేమిటని ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.
పోస్కో కంపెనీ ప్రతినిధులు 2018 లోనే స్టీల్ ప్లాంట్ సందర్శన .. అప్పుడున్నది టీడీపీనే
పోస్కో కంపెనీ ప్రతినిధులు , కొరియా రాయబారి 2018 అక్టోబర్ 22వ తేదీన విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించారని , ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా తెలియజేశారని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నాడు అధికారంలో ఉన్నది టిడిపినేనని, అప్పుడు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పాపం చంద్రబాబుదే అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు రెండు నాలుకల ధోరణి మానుకోవాలని విజయసాయి హితవు
చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని విమర్శలు గుప్పించారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు రెండు నాలుకల ధోరణి మానుకోవాలని విజయసాయిరెడ్డి హితవు పలికారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని తప్పు పట్టారు . విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ పాపం మీదంటే మీదంటూ అటు టీడీపీ ఇటు వైసీపీ నేతలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నారు .
ఇదిలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణా సమితి జేఏసీ గా ఏర్పడి ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తోంది.