చెన్నైలో విజయశాంతికి స్థలం, పద్మినికే ఎక్కువ ఆస్తులు
హైదరాబాద్: మెదక్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న నటి విజయశాంతి తనకు చెన్నై కోయంబేడులో వ్యవసాయేతర భూమి ఉందని, దాని ప్రస్తుత మార్కెట్ విలువ రూ.27 కోట్లు ఉంటుందని అఫిడవిట్లో పేర్కొన్నారు. చెన్నై అన్నా నగర్లో భర్త పేరిట ఉన్న వ్యవసాయ భూమి విలువ మార్కెట్ ధర ప్రకారం రూ.1.80 కోట్లుగా ఉంటుందని చూపారు.
తన వద్ద 57 లక్షలకు పైగా విలువైన బంగారం, టయోటా కారుందని, బంజారాహిల్స్ ఆంధ్రాబ్యాంకులో, ఢిల్లీలోని పార్లమెంటు హౌస్ ఎస్బిఐ ఖాతాలో నగదు ఉందని పేర్కొంది. తన వద్ద ఐదు లక్షల రూపాయల నగదు ఉన్నట్లు తెలిపారు. హైదరాబాదులోని విఆర్ నగర్లో భర్త పేరిట రూ.36.41 లక్షల ఇంటి స్థలం, పటాన్ చెరువులో రూ.71 లక్షల విలువైన మరో స్థలం ఉన్నట్లు పేర్కొన్నారు.
ఆందోలు అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తన ఎన్నికల అఫిడవిట్లో.. తన కంటే తన భార్య ఆస్తిపరురాలుగా పేర్కొన్నారు. తనకు రూ.22.75 లక్షల విలువైన ఆస్తులున్నట్లు దామోదర తెలిపారు. తన భార్య పేరిట రూ.9.79 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు వెల్లడించారు. కూతురు త్రిషా రెడ్డి పేరుమీద రూ.5.85 లక్షల ఆస్తులున్నాయన్నారు.
తెరాస సిరిసిల్ల అభ్యర్థి కల్వకుంట్ల తారక రామారావు తన పేరిట రూ.2,97,53,020, భార్య పేరిట 2,05,98,239 ఆస్తులున్నట్లు చెప్పారు. స్థిర, చరాస్తులు, రుణాలు భార్య, తన పేరిట ఉన్న వాటిని పేర్కొన్నారు. సిద్దిపేటకు నామినేషన్ దాఖలు చేసిన హరీష్ రావు తన మొత్తం ఆస్తుల విలువ రూ.2.96 కోట్లకు పైగా చూపించారు.